మహారాష్ట్రలో రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజుకి 60 వేలకి పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోగులను బతికించేందుకు అవసరమైన ఆక్సిజన్ నిల్వలు కూడా తగ్గిపోతున్న తరుణంలో అపర కుబేరుడు ముకేశ్ అంబానీ ఉదారత చాటుకున్నారు. కరోనా రోగులకు ప్రాణవాయువు అందించేందుకు ముందుకొచ్చారు. గుజరాత్ రిఫైనరీ నుంచి ఆక్సిజన్ వాయువును సరఫరా చేయనున్నారు.
ప్రపంచంలోనే అతి పెద్దదైన గుజరాత్లోని జామ్నగర్ రిలయన్స్ రిఫైనరీ నుంచి ఆక్సిజన్ను మహారాష్ట్రకు అందజేయనున్నట్లు రిలయన్స్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అందులో భాగంగా వంద టన్నుల ఆక్సిజన్ను ఉచితంగా పంపనున్నారు. అదే విషయాన్ని మహారాష్ట్ర మంత్రి ఒకరు తెలిపారు. రిలయన్స్ రిఫైనరీ నుంచి 100 టన్నుల ఆక్సిజన్ మహారాష్ట్రకు రాబోతోందని ఆయన తెలిపారు. సమన్వయ కమిటీ ఆ పనులు చూస్తోందని ఆయన తెలియజేశారు.