దృశ్యం-2 షూటింగ్ పూర్తి...మరీ ఇంత ఫాస్ట్ గా?!!

     Written by : smtv Desk | Thu, Apr 15, 2021, 07:03 PM

దృశ్యం-2 షూటింగ్ పూర్తి...మరీ ఇంత ఫాస్ట్ గా?!!

సినిమాలైనా.. ఈవెంట్లు అయినా.. దగ్గుబాటి వెంకటేశ్ స్టైలే వేరు. ఒకప్పుడు క్లాస్ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరైన వెంకీ.. గత కొంతకాలంగా ఎక్కువ శాతం మల్టీస్టారర్ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం వెంకటేశ్ తమిళంలో సూపర్ హిట్ సాధించిన ‘అసురన్’ రీమేక్‌గా తెరకెక్కుతున్న ‘నారప్ప’ సినిమాతో పాటు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్‌-2’ సీక్వెల్‌గా రూపొందుతున్న ‘ఎఫ్-3’ సినిమాలో నటిస్తున్నారు. ఇక మలయాళం సూపర్‌స్టార్ ప్రధాన పాత్రలో నటించిన ‘ దృశ్యం-2’ సినిమా రీమేక్‌లోనూ ఆయన ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.

‘దృశ్యం-2’ కొంతకాలం క్రితం ఓటీటీలో విడుదలై.. అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమా విడుదలైన కొన్ని రోజులకే తెలుగులో షూటింగ్ ప్రారంభించారు. దృశ్యం మొదటి భాగంలో నటించిన స్టార్ క్యాస్ట్‌నే ఈ సినిమాలోనూ తీసుకున్నారు. అయితే ఈ సినిమాలో వెంకీ మామా తన భాగం షూటింగ్‌ని అప్పుడే పూర్తి చేశారట. ఈ విషయాన్ని దర్శకుడు జీతు జోసెఫ్ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. ‘ఈరోజు డీ2 సినిమా షూటింగ్‌లో వెంకటేశ్‌గారి చివరి వర్కింగ్ డే. మీ సహకారానికి, మద్దతుకి ధన్యవాదాలు సార్’ అంటూ అతను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

దీంతో అభిమానులు వెంకటేశ్ స్పీడ్ చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. ‘అసలు ఇంత స్పీడ్‌గా ఎలా వెంకీ మామా’ అంటూ మీమ్స్, కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు దర్శకుడిని ప్రశంసిస్తూ... ‘నువ్వు జీతు జోసెఫ్ కాదు.. జెట్ స్పీడ్ జోసెఫ్’ అని అంటున్నారు. 2014లో విడుదలైన దృశ్యం సినిమా సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకటేశ్ భార్యగా మీనా నటిస్తుండగా.. ఆయన కూతుళ్లుగా కృతికా జయకుమార్, ఎస్తర్ అనిల్ నటిస్తున్నారు. దాదాపు ముగింపు దశలో ఉన్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.





Untitled Document
Advertisements