కాలేజీలు ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకోవడంపై హైకోర్టులో విచారణ

     Written by : smtv Desk | Thu, Apr 15, 2021, 07:09 PM

కాలేజీలు ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకోవడంపై హైకోర్టులో విచారణ

ప్రైవేట్ కాలేజీలు విద్యార్థులకు సంబంధించిన ఒరిజినల్ ధ్రువపత్రాలు (సర్టిఫికేట్లు) తీసుకుంటున్నాయన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనలకు విరుద్ధంగా కాలేజీలు వ్యవహరిస్తున్నాయని ఫోరం అగేనిస్ట్ కరప్షన్‌ వ్యవస్థాపకుడైన విజయ్ గోపాల్ ప్రజా ప్రయోజన వాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ), జేఎన్టీయూ(హైదరాబాద్) హైకోర్టుకు నివేదికలు సమర్పించాయి.

విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకోవద్దని కాలేజీలకు స్పష్టం చేశామని హైదరాబాద్ జేఎన్టీయూ స్పష్టం చేసింది. కాలేజీల అనుబంధ గుర్తింపు నిబంధనలోనూ దీన్ని చేర్చినట్టు జేఎన్టీయూ తెలియజేసింది. ప్రైవేటు కాలేజీలు ఒరిజినల్ ధ్రువపత్రాలను తీసుకున్నట్టు తమకు ఇంతవరకు ఫిర్యాదులు రాలేదని ఓయూ తెలియజేసింది. ఓయూ, జేఎన్టీయూహెచ్ నివేదికలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు విచారణ ముగించింది.

ఆన్ లైన్ రుణయాప్‌ల వ్యవహారంపై కూడా హైకోర్టులో విచారణ జరిగింది. రుణయాప్ లపై హైకోర్టుకు డీజీపీ నివేదిక సమర్పించారు. రుణ యాప్‌లకు సంబంధించి 56 కేసులు నమోదు చేశామని రుణాల కోసం వేధిస్తున్న 118 మొబైల్ నంబర్లను కూడా గుర్తించామని డీజీపీ కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి 290 రుణ యాప్‌లను గుర్తించి బ్లాక్ చేసినట్టుగా కూడా కోర్టుకు తెలియజేశారు. ఈ రుణ యాప్ కేసులో భారత్‌తో పాటు చైనా, ఇతర దేశీయుల ప్రమేయం కూడా ఉందని, అలాగే ఈ కేసులో ఆర్బీఐ అనుమతి లేని రెండు ఎన్ ఎఫ్ బీ ఐ లను కూడా గుర్తించామని డీజీపీ తెలిపారు. అనుమతి లేని ఎన్ ఎఫ్ బీ ఐ లపై ఏం చర్యలు తీసుకున్నారని హైకోర్టు ప్రశ్నించింది. మరిన్ని వివరాలతో 4 వారాల్లో మరో నివేదిక సమర్పించాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది.





Untitled Document
Advertisements