కరోనా కాటు ... ఒక్కో బెడ్ పై ఇద్దరికి చొప్పున స్థానం... ఢిల్లీ ఆసుపత్రిలో పరిస్థితి విషమం

     Written by : smtv Desk | Fri, Apr 16, 2021, 11:05 AM

దేశ రాజధానిని కరోనా ఎలా వణికిస్తుందో తెలుసుకోవాలంటే, ఢిల్లీలోని లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రి (ఎల్ఎన్జేపీ)ని సందర్శిస్తే చాలు. ఇక్కడ దాదాపు 1,500కు పైగా పడకలు రోగులకు స్వస్థత చేకూర్చేందుకు సిద్ధంగా ఉంటాయి. ఇప్పుడు అవన్నీ నిండిపోయాయి. ఎంతలా అంటే, ఆక్సిజన్ కోసం ఒక్కో బెడ్ పై ఇద్దరికి చొప్పున స్థానం కల్పించాల్సి వస్తోంది. ఆసుపత్రి అంబులెన్స్ లు రోజుకు వందల మంది రోగులను తీసుకుని రావడంతో వారికి బెడ్స్ సమకూర్చడం కష్టమవుతోంది.

ఈ సంవత్సరం ఆరంభంలో దేశంలో రోజుకు 10 వేల వరకూ ఉన్న రోజువారీ కేసుల సంఖ్య, ఇప్పుడు 2 లక్షల మార్క్ ను అధిగమించింది. అధికారిక గణాంకాల ప్రకారం, ప్రపంచంలోని మరే దేశంలోనూ ఒక్క రోజులో రెండు లక్షలకు పైగా కేసులు నమోదు కాలేదు. ఇండియాలోని అతిపెద్ద కొవిడ్ ఆసుపత్రుల్లో ఎల్ఎన్జేపీ కూడా ఒకటన్న సంగతి తెలిసిందే. కరోనా సోకిన వారు ఇక్కడికి కేవలం అంబులెన్స్ లలో మాత్రమే కాదు... బస్సుల్లోనూ, ఆటో రిక్షాల్లోనూ సైతం వస్తున్నారు. ఇక్కడ ఉన్న కరోనా రోగుల్లో అప్పుడే పుట్టిన చిన్నారి కూడా ఉండటం గమనార్హం.

"మాపై ఇప్పుడు చాలా ఒత్తిడి ఉంది. ఆసుపత్రి మొత్తం సామర్థ్యానికి మించి నిండిపోయింది" అని ఎల్ఎన్జేపీ మెడికల్ డైరెక్టర్ సురేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. కరోనా సోకి క్రిటికల్ గా ఉన్న వారి కోసం ఇప్పుడు 300 పడకలు కేటాయించినా, అవి సరిపోవడం లేదని ఆయన అన్నారు. ఒకరికి ఒకరు ఏ మాత్రమూ సంబంధం లేని పేషంట్లు పడకలను పంచుకోవాల్సి వస్తోందని, కరోనాతో మరణించిన వారిని మార్చురీలో చోటు లేక, వార్డు బయటే ఉంచి, అటునుంచి అటే శ్మశానానికి పంపాల్సి వస్తోందని వాపోయారు. ఒక్కరోజులో ఆసుపత్రిలో 158 మందిని చేర్చుకోవాల్సి వచ్చిందని, వారంతా పరిస్థితి విషమించిన వారేనని ఆయన అన్నారు.

దేశంలో ప్రజలు కరోనా నిబంధనలను పాటించక పోవడమే కేసులు ఇంతగా పెరగడానికి కారణమని అభిప్రాయపడ్డ ఆయన, ప్రజల నిర్లక్ష్యం దేశంలో పరిస్థితిని విషమించేలా చేసిందని అన్నారు.





Untitled Document
Advertisements