"చేతులు జోడించి అడుగుతున్నా క్షమించండి"

     Written by : smtv Desk | Fri, Apr 16, 2021, 01:05 PM


ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ల భరణి గొప్ప శివ భక్తుడు. తరచూ శివునిపై తన భక్తి చూపిస్తూ కీర్తనలు, కవితలు, పాటలు రాస్తుంటారు. ఆయన శివుడ్ని స్మరిస్తూ రాసిన పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే ఇటీవల ఆయన ఫేస్ బుక్‌లో ‘శబ్భాష్‌రా శంకరా’ అంటూ సీక్వెన్స్ స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగా.. ‘గప్పాల్ గొడ్తరు గాడ్దె కొడుకులు.. నువ్వుండంగ లేవంటరు.. ఉన్నవో లేవో చెవుల జెప్పిపోరా శబ్భాష్‌రా శంకరా!!’ అంటూ ఒక పోస్ట్‌ని పెట్టారు.

అయితే దీనిపై హేతువాదులు భగ్గుమన్నారు.. తనికెళ్ల భరణిని ఏకిపారేశారు. ఫేస్ బుక్ వేదికగా బహిరంగ సవాల్ చేశారు. ముఖ్యంగా బిగ్ బాస్ ఫేమ్.. మానవవాదీ, హేతువాదీ, నాస్తికుడూ బాబు గోగినేని.. తనికెళ్ల భరణి వ్యాఖ్యల్ని ఖండిస్తూ బహిరంగ సవాల్ చేశారు. ‘గాడిద కొడుకులు’ అని ఎవరైనా ఒళ్లు బలిస్తేనే వ్రాస్తారు.. అంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా తనికెళ్ల భరణిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు బాబు గోగినేని.. ఈ వివరాలు ఈ కింది కథనంలో ఉంది.


అయితే ఇది పెద్ద వివాదంగా మారడంతో తనికెళ్ల భరణి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. నేను ఎవ్వరికీ వ్యతిరేకం కాదంటూ.. బేషరుతుగా క్షమాపణ తెలియజేస్తూ వీడియో విడుదల చేశారు. ‘గత కొన్ని రోజులుగా ‘శభాష్‌ రా శంకరా..’ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్టూ చేస్తూ వస్తున్నా. అయితే.. దురదృష్టవశాత్తూ కొన్ని వ్యాఖ్యలు కొంతమంది మనసును నొప్పించడం.. బాధ కలిగించడం జరిగిందని తెలిసింది. ఇక దానికి నేను వివరణ ఇచ్చుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఏం చెప్పినా కవరింగ్ లాగే ఉంటుంది కాబట్టి.. నేను చేతులు జోడించి బేషరతుగా క్షమాపణలు చెబుతున్నా. అలాగే ఆ పోస్టును డిలీట్ చేశా.. నాకు హేతువాదులన్నా.. మానవతావాదులన్నా గౌరవమే తప్పితే వ్యతిరేకత లేదు. అలాగే ఏ మనిషినీ నొప్పించే హక్కు, అధికారం ఎవరికీ లేదు. జరిగిన పొరపాటుకు మరోసారి మన్నించమని కోరుతున్నా.. అందరికీ నమస్కారం’ అంటూ చేతులు జోడించి క్షమాపణలు తెలిపారు తనికెళ్ల భరణి.





Untitled Document
Advertisements