స్లో ఓవర్ రేట్ : "నువ్వే ఓ నిమిషం తీసుకున్నావు" అంపైర్‌తో పంత్ వాదన

     Written by : smtv Desk | Fri, Apr 16, 2021, 02:31 PM

స్లో ఓవర్ రేట్ :

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ జరిమానా నుంచి తప్పించుకునేందుకు ఓ కొత్త వాదనని తెరపైకి తెచ్చాడు. రాజస్థాన్ రాయల్స్‌తో ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో.. ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల తేడాతో రాజస్థాన్ చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ హిట్టర్ డేవిడ్ మిల్లర్ (62: 43 బంతుల్లో 7x4, 2x6), క్రిస్ మోరీస్ (36 నాటౌట్: 18 బంతుల్లో 4x6) దూకుడుగా ఆడటంతో.. రిషబ్ పంత్ ఫీల్డింగ్ మార్పులతో పాటు బౌలర్లతోనూ చర్చలు జరుపుతూ కనిపించాడు. ఈ క్రమంలో మ్యాచ్ సమయం వృథా అయినట్లు ఆలస్యంగా గ్రహించిన రిషబ్ పంత్.. స్లో ఓవర్ రేట్ తప్పిదం నుంచి తప్పించుకునేందుకు కొత్త ప్లాన్ వేశాడు.

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇటీవల తెచ్చిన నిబంధనల ప్రకారం.. టీ20ల్లో 20 ఓవర్లని 90 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన గంటకి కనీసం 14.1 ఓవర్లు వేయాలి. కానీ.. ఢిల్లీ క్యాపిటల్స్ తమకి కేటాయించిన సమయంలోపు వేయాల్సిన ఓవర్లని వేయలేకపోయింది. దాంతో.. స్లో ఓవర్ రేట్ తప్పిదం కింద రిషబ్ పంత్‌కి జరిమానా పడే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ.. మ్యాచ్‌లో వృథా అయిన సమయం 1-2 నిమిషాల్లోనే ఉన్నందున మ్యాచ్ రిఫరీ వదిలేసినా ఆశ్చర్యపోలేం. ఇటీవల స్లో ఓవర్‌ రేట్ తప్పిదానికి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి రూ.12 లక్షలు జరిమానా విధించిన విషయం తెలిసిందే.

రాజస్థాన్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ తప్పిదానికి జరిమానా పడకుండా ఉండేందుకు రిషబ్ పంత్ మైదానంలో ఫీల్డ్ అంపైర్‌తో ‘‘మ్యాచ్‌లో ఓ నిమిషం నువ్వు తీసుకున్నావ్ అంపైర్’’ అని చెప్పడం స్టంప్ మైక్‌లో రికార్డైంది. దాంతో.. అంపైర్ నవ్వుతూ కనిపించాడు. వాస్తవానికి అంపైర్లు మైదానంలో టైమ్‌ని ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తూ ఉంటారు. ఇందులో థర్డ్ అంపైర్ నిర్ణయాలు, డీఆర్ఎస్, ఆటగాళ్లు గాయపడటం, బంతుల్ని మార్చడం తదితర వాటికి సమయం మినహాయింపు ఉంటుంది. ఫీల్డ్ అంపైర్‌తో స్పిన్నర్ అశ్విన్ మ్యాచ్ మధ్యలో ఓసారి మాట్లాడుతూ కనిపించాడు.





Untitled Document
Advertisements