కనీస గౌరవం లేకుండా పెద్దాయనపై కండక్టర్ దాడి...తిక్క కుదిర్చిన సోషల్ మీడియా

     Written by : smtv Desk | Fri, Apr 16, 2021, 05:51 PM

కనీస గౌరవం లేకుండా పెద్దాయనపై కండక్టర్ దాడి...తిక్క కుదిర్చిన సోషల్ మీడియా

నిత్యం మన కళ్లముందు ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. చీటికీమాటీకీ గొడవ పెట్టుకునే చిరువ్యాపారులు.. ప్రయాణికులను లెక్కలేనట్టు మాట్లాడే కండక్టర్లు.. బెదిరించి బస్సు దించేసే డ్రైవర్లు మనకు తారసపడుతుంటారు. ఎందుకులే గొడవ అనుకుని సర్దుకుని వెళ్లిపోయేవారు కొందరైతే.. ఎదురుతిరిగి ప్రశ్నించేవారు మరికొందరు.. అవసరమైతే గొడవకు దిగేవారు ఇంకొందరు.

అయితే ఆ ఎదుటి వ్యక్తి ఏ పల్లెటూరి వ్యక్తో.. నిరక్షరాస్యుడో.. లేక వృద్ధుడో అయితే ఇక అవతలి వ్యక్తి అస్సలు మాట వినడు. దిక్కున్న చోట చెప్పుకోమంటూ హంగామా సృష్టిస్తాడు. సరిగ్గా అలాగే వీరంగం వేసిన ఓ కండక్టర్‌ యూనిఫాం పీకేసి ఇంట్లో కూర్చోబెట్టింది సోషల్ మీడియా. ఎండీలు, జీఎంలు కదిలివచ్చేలా చేసింది. ఒకసారి వీడియో వైరల్ అయిందంటే అదెంత పనిచేస్తుందో ఊహించడం కష్టం అనే రేంజ్‌లో తన పవరేంటో చూపించింది!!

కోయంబత్తూర్ జిల్లా చిత్తోడ్‌కి చెందిన కూరగాయాల వ్యాపారి పి గణేశన్(58) ఈరోడ్ వెళ్లేందుకు తమిళనాడు ఆర్టీసీ బస్సు ఎక్కాడు. ఈరోడ్‌కి ఒక టిక్కెట్ ఇవ్వాలని కండక్టర్‌ బి కుమార్(38)కి వంద రూపాయల నోటు ఇచ్చాడు. అందుకు కండక్టర్ విసుగ్గా చిల్లర ఇమ్మని గద్దించాడు. టిక్కెట్‌కి సరిపడా చిల్లర ఇవ్వాలని హుకుం జారీ చేశాడు. తన వద్ద సరిపోయే చిల్లర లేదని చెప్పడంతో కండక్టర్‌కి చిర్రెత్తుకొచ్చింది.

వయసులో పెద్దాయన అనే కనీస గౌరవం లేకుండా గణేశన్‌పై కండక్టర్ కుమార్ చేయిచేసుకున్నాడు. కండక్టర్ దాష్టీకాన్ని తోటి ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. కండక్టర్ పెద్దాయనను కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో తమిళనాడు రాష్ట్ర మానవ హక్కుల సంఘం స్పందించింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించి ఆర్టీసీ ఎండీకి షాకిచ్చింది.

అసలేం జరిగిందో సవివరంగా నివేదిక పంపాలంటూ ఎండీకి నోటీసులిచ్చింది. మూడు వారాల్లోపు నివేదిక పంపించాలని ఆదేశించింది. మరోవైపు బాధితుడు గణేశన్ కండక్టర్ కుమార్‌పై చిత్తోడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కండక్టర్ అనుచిత ప్రవర్తన, మానవ హక్కుల కమిషన్ ఆదేశాల నేపథ్యంలో చేయిజారిన కండక్టర్‌కి తగిన శాస్తి జరిగింది. యూనిఫాం తీసేసి ఇంటికి పరిమితం చేశారు అధికారులు. కండక్టర్‌ని ఇప్పటికే విధుల నుంచి సస్పెండ్ చేశామని కోయంబత్తూర్ డివిజన్ జీఎం గణపతి తెలిపారు.





Untitled Document
Advertisements