అమెరికా ఆంక్షలు కరోనా వ్యాక్సిన్ ఇండస్ట్రీకి కొత్తకష్టాలు

     Written by : smtv Desk | Fri, Apr 16, 2021, 06:41 PM

అమెరికా ఆంక్షలు కరోనా వ్యాక్సిన్ ఇండస్ట్రీకి కొత్తకష్టాలు

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతమవడంతో ఆ ప్రభావం కరోనా వ్యాక్సిన్ల తయారీపై పడింది. అటు అమెరికాలోనూ కరోనా కేసులు తీవ్రంగా పెరిగిపోవడంతో అమెరికన్ ప్రభుత్వం ఎగుమతులపై నిషేధం విధించింది. వ్యాక్సిన్‌ల తయారీకి అవసరమైన ముడి పదార్థాల ఎగుమతులను నిలిపివేసింది. జర్మనీ కూడా అమెరికా బాటలోనే నడవడంతో వ్యాక్సిన్ కంపెనీలకు కొత్తకష్టం వచ్చిపడింది. వ్యాక్సిన్ తయారు చేసే సామర్థ్యమున్నా ముడి పదార్థాలు దొరకని పరిస్థితి.

ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అమెరికాకి ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. కోవిడ్-19 వ్యాక్సిన్ల తయారీకి వినియోగించే ముడి పదార్థాలపై ఎగుమతులపై నిషేధం తొలగించాలని కోరింది. ముడిపదార్థాలు అందుబాటులోకి వస్తే వ్యాక్సిన్‌ల ఉత్పత్తిని గణనీయంగా పెంచవచ్చని అభిప్రాయపడింది. ఈ మేరకు సీరం సీఈవో అదర్ పూనావాలా అమెరికా అధ్యక్షుడిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.

కరోనా వైరస్‌ను ఓడించడంలో నిజంగా అందరం ఏకం కావాలంటే వ్యాక్సిన్ల తయారీకి వినియోగించే ముడి పదార్థాల ఎగుమతులపై ఆంక్షలను ఎత్తేయాలని పూనావాలా కోరారు. అమెరికా వెలుపల ఉన్న వ్యాక్సిన్ ఇండస్ట్రీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారిక ట్విటర్ ఖాతా @POTUS ని ట్యాగ్ చేశారు. పూణెలోని సీరం సంస్థ ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్న విషయం తెలిసిందే.





Untitled Document
Advertisements