హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద నిన్న వైయస్ షర్మిల చేపట్టిన మూడు రోజుల నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. దీక్షకు ఒక్క రోజు అనుమతి మాత్రమే ఉందంటూ ఆమెను బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా అక్కడ దారుణ పరిస్థితి నెలకొంది. షర్మిల జాకెట్ కూడా చిరిగిపోయింది. ఈ ఘటనపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రజల కోసం, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం షర్మిల చేపట్టిన దీక్ష సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలు తనను బాధించాయని చెప్పారు. ఉదయం నుంచి ఆమె ఏమీ తినలేదని... దీక్షా స్థలి నుంచి తన ఇంటి వరకు నడిచి వెళ్తానని ఆమె చెపితే నచ్చచెప్పాల్సింది పోయి దురుసుగా ప్రవర్తించారని అన్నారు. ఆమె జాకెట్ చిరిగిపోయేలా ప్రవర్తించడం చాలా దారుణమని మండిపడ్డారు. షర్మిల పట్ల మహిళా పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదని అన్నారు.
షర్మిలపై అమానుషంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తాను డిమాండ్ చేస్తున్నానని రఘురాజు చెప్పారు. తనకు బాగా నచ్చిన నేతల్లో కేసీఆర్ ఒకరని... పోలీసులపై చర్యలకు ఆయన ఆదేశిస్తారనే తాను భావిస్తున్నానని అన్నారు. షర్మిలపై దాడిని ఖండిస్తూ ఆమె తల్లి విజయమ్మ చలించిపోయిన తీరు తనతో పాటు ఎంతో మందిని ఆలోచింపజేసిందని చెప్పారు. ఆ నిమిషం అందరికీ అమరావతి మహిళా రైతులు గుర్తుకొచ్చారని తెలిపారు.