"శవాల కుప్పలను చూసేందుకు మేము సిద్ధంగా లేము"

     Written by : smtv Desk | Fri, Apr 16, 2021, 07:58 PM


దేశంలో రోజురోజుకీ కరోనా కేసులు భయోత్పాతం సృష్టిస్తున్నాయి. లక్షల సంఖ్యలో కేసులు.. వేల సంఖ్యలో మరణాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా విలయతాండవంతో రాష్ట్రాలు నిషేధాజ్ఞలు విధిస్తున్నాయి. కోవిడ్ ఆంక్షలను కఠినంగా అమలు చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. అందులో భాగంగానే హర్యానాలోని బీజేపీ‌-జేజేపీ ప్రభుత్వం కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చింది.

కోవిడ్ ఆంక్షల అమలుపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాగ్రహాన్ని ఎదుర్కొంటామని.. కానీ శవాల కుప్పలను చూసేందుకు తాము సిద్ధంగా లేమని నిర్మొహమాటంగా స్పష్టం చేశారు. కరోనా కట్టడికి రెండు మార్గాలున్నాయన్న అనిల్.. లాక్‌డౌన్ విధించే పరిస్థితి లేదన్నారు. మొదటిది లాక్‌డౌన్.. కానీ ప్రజలందరూ బయటికెళ్లి పనిచేసుకుని బతికే అవకాశం కల్పించాలన్నారు.

రెండవది కోవిడ్ నిబంధనలను క్రమశిక్షణతో పాటించడమేనని మంత్రి చెప్పారు. కోవిడ్ నిబంధనల అమలుకు సంబంధించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చామని ఆయన అన్నారు. నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. కఠినత్వం కారణంగా ప్రజాగ్రహం పెల్లుబికినా ఎదుర్కొంటామని.. కానీ కోవడ్‌తో శవాల కుప్పలను చూసేందుకు సిద్ధంగా లేమని ఆయన స్పష్టం చేశారు.

గతంలో అంత్యక్రియలకు 50 మంది, ఇండోర్ వేడుకలకు సగం సీటింగ్, బహిరంగ ప్రదేశాల్లో 500 మంది వరకూ అనుమతించారు. ఆ నిబంధనలను సవరిస్తూ హర్యానా ప్రభుత్వం ఆదేశాల్చింది. అంత్యక్రియలకు 20 మంది, ఇండోర్ వేడుకలకు 50 మంది.. బహిరంగ ప్రదేశాల్లో 200 మందికి మాత్రమే అనుమతించింది. వాటితో పాటు కరోనా నిబంధనలను తప్పకుండా పాటించాలని ఆదేశించింది.





Untitled Document
Advertisements