"స్వదేశీ టీకాల ఉత్పత్తికి కేంద్రం ఫుల్ సపోర్ట్... భారీ ఆర్ధిక సాయం"

     Written by : smtv Desk | Fri, Apr 16, 2021, 08:09 PM


దేశంలో రోజురోజుకీ కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టింది. వ్యాక్సిన్ ఉత్పత్తికి మరింత ఊతమిచ్చే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. స్వదేశీ టీకాల ఉత్పత్తిని రెట్టింపు చేసేందుకు కంపెనీలకు భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. ఆత్మనిర్భర్ భారత్ 3.0 మిషన్ కోవిడ్ సురక్ష పథకంలో భాగంగా భారత్ బయోటెక్, హాఫ్‌కిన్, ఇండియన్ ఇమ్యునోలాజికల్ లిమిటెడ్ హైదరాబాద్‌కి ప్రత్యేక గ్రాంట్ మంజూరు చేసింది.

భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఉత్పత్తిని రెట్టింపు చేసేందుకు రూ.65 కోట్ల రూపాయల సాయం ప్రకటించింది. ప్రస్తుతం భారత్ బయోటెక్ నెలకు కోటి డోసులు ఉత్పత్తి చేస్తోంది. మే-జూన్ నాటికి వ్యాక్సిన్ ఉత్పత్తని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. జూలై-ఆగస్టు నాటికి 6 నుంచి 7 కోట్ల డోసుల కోవ్యాక్సిన్ ఉత్పత్తికి రంగం సిద్ధం చేసింది. ఈ ఏడదాది సెప్టెంబర్ నాటికి 10 కోట్ల డోసులకు పెంచనుంది.

ఇటీవల స్వదేశీ వ్యాక్సిన్ తయారీ ప్లాంట్‌లను సందర్శించిన నిపుణుల బృందం వ్యాక్సిన్ తయారీ సామర్థ్యాన్ని పెంచాల్సిన ఆవశ్యకతను గుర్తించి కేంద్రానికి సిఫారసులు చేసింది. నివేదికను పరిశీలించిన బయోటెక్నాలజీ విభాగం ఉత్పత్తి సామర్థ్యం పెంచుకునేందుకు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చింది. అందులో భాగంగా భారత్ బయోటెక్ బెంగళూరులో వ్యాక్సిన్ తయారీ కేంద్రానికి సుమారు రూ.65 కోట్లు గ్రాంట్ మంజూరు చేసింది.

అలాగే ముంబైలోని హాఫ్‌కిన్ బయోఫార్మాస్యూటికల్ లిమిటెడ్‌కి మరో రూ.65 కోట్లు అందించనుంది. వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు 12 నెలల సమయం పడుతుందని హాఫ్‌కిన్ సంస్థ తెలిపింది. అయితే ఆరు నెలల్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలని.. నెలకు 2 కోట్ల డోసులను ఉత్పత్తి చేసే విధంగా తయారుకావాలని కేంద్రం సూచించింది.నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్, భారత్ ఇమ్యునోలాజికల్స్ అండ్ బయోలాజికల్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని ఇండియన్ ఇమ్యునోలాజికల్ లిమిటెడ్ హైదరాబాద్‌కి కేంద్రం సాయం అందించనుంది. ఈ కంపెనీ నెలకు కోటిన్నర డోసుల వ్యాక్సిన్ ఉత్పత్తి చేయనుంది.





Untitled Document
Advertisements