తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఓవైపు నాగార్జున సాగర్ ఉప ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైన సమయంలో, మరోవైపు ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీఆర్ఎస్ పార్టీకి గుడ్బై చెప్పిన పాలేరు టీఆర్ఎస్ నేత మాధవి రెడ్డి రేపు ఇందిరా భవన్లో మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. పాలేరు నియోజక వర్గంలో టీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న ఆమె గతంలో పలు బాధ్యతలు నిర్వహించారు. అయితే మాధవి రెడ్డి రేపు అదికారికంగా తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఈ కార్యక్రమానికి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి సంభాని చంద్ర శేఖర్ తో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొననున్నారు.