ఐపీఎల్....‌‌ మహేంద్రసింగ్ ధోనీ @200 మ్యాచ్‌లు

     Written by : smtv Desk | Sat, Apr 17, 2021, 01:45 PM

ఐపీఎల్....‌‌ మహేంద్రసింగ్ ధోనీ @200 మ్యాచ్‌లు

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అరుదైన ఘనత సాధించాడు. పంజాబ్ కింగ్స్‌తో ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆడిన ధోనీ.. చెన్నై తరఫున 200 మ్యాచ్‌లు ఆడిన ఫస్ట్ క్రికెటర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకూ ఐపీఎల్ 206 మ్యాచ్‌లు ఆడిన ధోనీ.. 136.68 సగటుతో 4,632 పరుగులు చేశాడు. ఇందులో 23 హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం.

ఐపీఎల్‌లో కెప్టెన్‌గా చెన్నై సూపర్ కింగ్స్‌ టీమ్‌ని మూడు సార్లు విజేతగా నిలిపిన ధోనీ.. ఆరంభ సీజన్ 2008 నుంచి కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్‌ని మార్చని ఏకైక ఫ్రాంఛైజీ కూడా చెన్నై సూపర్ కింగ్స్ కావడం విశేషం. ఐపీఎల్‌లో చెన్నై టీమ్‌ని 176 మ్యాచ్‌ల్లో నడిపించిన ధోనీ.. ఛాంపియన్స్ లీగ్ టీ20లోనూ 24 మ్యాచ్‌ల్లో చెన్నై జట్టుకి నాయకత్వం వహించాడు. ఐపీఎల్ 2016, 2017 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్‌పై నిషేధం పడగా.. ఆ రెండు సీజన్లలో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ టీమ్‌కి ధోనీ ఆడాడు.

ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్‌గా ఇప్పటికే 216 సిక్సర్లతో నెం.1 స్థానంలో కొనసాగుతున్న మహేంద్రసింగ్ ధోనీ.. టోర్నీలో విజయవంతమైన వికెట్ కీపర్‌గా 148 ఔట్లలో భాగస్వామిగా ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తన తర్వాత మ్యాచ్‌ని రాజస్థాన్ రాయల్స్‌తో సోమవారం ఆడనుంది.





Untitled Document
Advertisements