బీసీసీఐ కాంట్రాక్ట్‌ : రవీంద్ర జడేజాకి ఎ గ్రేడ్.. విమర్శలు

     Written by : smtv Desk | Sat, Apr 17, 2021, 04:47 PM

బీసీసీఐ కాంట్రాక్ట్‌ : రవీంద్ర జడేజాకి ఎ గ్రేడ్.. విమర్శలు

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇటీవల ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్‌లపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారత క్రికెటర్లని ఎ+, ఎ, బి, సి గ్రేడ్‌లుగా విభజించిన బీసీసీఐ.. 2020-2021కి సంబంధించిన కాంట్రాక్ట్స్‌ని విడుదల చేసింది. అయితే.. ఇందులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రాకి మాత్రమే ఎ+ గ్రేడ్ దక్కింది. మూడు ఫార్మాట్లలోనూ రెగ్యులర్‌గా ఆడుతున్న ఆటగాళ్లకి మాత్రమే ఎ+ గ్రేడ్‌ని ఇచ్చిన బీసీసీఐ స్పష్టం చేయగా.. మరి 2019 వన్డే ప్రపంచకప్ నుంచి మూడు ఫార్మాట్లలోనూ రెగ్యులర్‌గా ఆడుతున్న రవీంద్ర జడేజాకి ఎందుకు ఎ+ గ్రేడ్‌ ఇవ్వలేదని మాజీ క్రికెటర్లు, అభిమానులు ప్రశ్నిస్తున్నారు. 2020, సెప్టెంబరు నుంచి 2021 సెప్టెంబరు మధ్యకాలానికి సంబంధించి.. బీసీసీఐ విడుదల చేసిన సెంట్రల్ కాంట్రాక్ట్‌లో చోటు దక్కించుకున్న ఆటగాళ్ల జాబితా ఇదే.

ఎ+ గ్రేడ్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా. కాంట్రాక్ట్‌లో భాగంగా వీరికి ఏడాది రూ.7 కోట్లని బీసీసీఐ చెల్లించనుంది.

ఎ గ్రేడ్ కాంట్రాక్ట్‌లో 10 మంది ఆటగాళ్లకి చోటు దక్కింది. ఇందులో అజింక్య రహానె, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, చతేశ్వర్ పుజారా, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా ఉన్నారు. వీరికి ఏడాదికి రూ.5 కోట్లని బీసీసీఐ చెల్లించనుంది.

బి గ్రేడ్‌ కాంట్రాక్ట్‌లో టెస్టు టీమ్ వికెట్ కీపర్ సాహా, ఫాస్ట్ బౌలర్లు ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, శార్ధూల్ ఠాకూర్, ఓపెనర్ మయాంక్ అగర్వాల్ చోటు దక్కించుకున్నారు. వీరికి ఏడాదికి రూ. 3 కోట్లకి బీసీసీఐ చెల్లించనుంది.


సి గ్రేడ్‌లో కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీ, దీపక్ చాహర్, శుభమన్ గిల్, హనుమ విహారి, అక్షర్ పటేల్, శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, చాహల్, మహ్మద్ సిరాజ్ చోటు దక్కించుకున్నారు. వీరికి రూ.1 కోటిని బీసీసీఐ చెల్లించనుంది.

రవీంద్ర జడేజాకి ఎ గ్రేడ్ కాంట్రాక్ట్ మాత్రమే బీసీసీఐ ఇవ్వడంపై టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ పెదవి విరిచారు. ‘‘రవీంద్ర జడేజా నిస్సందేహంగా ఎ+ గ్రేడ్ ఆటగాడు. అతను మూడు ఫార్మాట్లలోనూ చక్కగా ఆడుతున్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ అతను మెరుగ్గా ఉన్నాడు. అయినప్పటికీ.. ఎ+ గ్రేడ్ కాంట్రాక్ట్ అతనికి ఇవ్వకపోడానికి గల కారణం తెలియడం లేదు’’ అని ఎమ్మెస్కే ప్రసాద్ నిరాశ వ్యక్తం చేశారు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ కూడా రవీంద్ర జడేజాకి మద్దతుగా నిలిచాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు తర్వాత జడేజా పేరు ఉండాల్సిందన్నాడు.





Untitled Document
Advertisements