లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఎట్టకేలకు బెయిల్

     Written by : smtv Desk | Sat, Apr 17, 2021, 05:02 PM

లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఎట్టకేలకు బెయిల్

దాణా కుంభకోణం కేసులో బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఝార్ఖండ్ హైకోర్టు ఆయనకు శనివారం బెయిల్ మంజూరు చేసింది. లాలూ ప్రసాద్ యాదవ్ బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పశుగ్రాసం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడి దుమ్కా ట్రెజరీ నుంచి రూ.3.13 కోట్ల విత్ డ్రా చేసినట్టు దోషిగా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయనకు సీబీఐ న్యాయస్థానం జైలు శిక్ష ఖరారు చేసింది. లాలూపై ఉన్న నాలుగు కేసుల్లో మూడింటిలో ఇప్పటికే బెయిల్ వచ్చింది.

తాజాగా, నాలుగో కేసులోనూ బెయిల్ రావడంతో ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు. అయితే, ఇటీవల అనారోగ్యానికి గురైన లాలూ ప్రస్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. కోలుకున్న తర్వాత ఆయన ఇంటికి వెళ్లన్నున్నారు. గతేడాది అక్టోబరు 9న ఝార్ఖండ్‌ హైకోర్టు చైబసా ఖజానా కేసులో లాలూకు రూ. 2 లక్షల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. దుమ్కా ఖజానా కేసులో శిక్ష పడినందున ఆయన జైల్లోనే గడిపారు.

1990ల్లో లాలూ బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ స్కామ్ జరిగింది. సుదీర్ఘ కాలం పాటు విచారణ సాగిన ఈ కేసులో 2017 డిసెంబరులో దోషిగా తేలడంతో శిక్ష ఖరారైంది. నాటి నుంచి ఆయన జైల్లో ఉన్నారు. లాలూ అనారోగ్యానికి గురికావడంతో రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్‌లో చికిత్స తీసుకున్నారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ రావడంతో ఈ ఏడాది జనవరిలో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఆయన మెరుగైన వైద్యం కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు జనవరి 23న తరలించారు. అప్పటి నుంచి అక్కడే లాలూకు చికిత్స కొనసాగుతోంది.





Untitled Document
Advertisements