పశ్చిమ బెంగాల్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆడియో టేపుల వ్యవహారం సర్దుమణగక ముందే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆడియో టేపు దుమారం రేపుతోంది. నాలుగో విడత ఎన్నికల పోలింగ్ రోజున భద్రతా దళాల కాల్పుల్లో మరణించిన వారి మృతదేహాలతో ర్యాలీ చేద్దామంటూ మమత పార్టీ నేతలకు సూచిస్తున్నట్లు చెబుతున్న ఆడియో టేప్ సంచలనంగా మారింది. ఆ ఘటనను మమత రాజకీయం కోసం వాడుకునేందుకు చూశారంటూ బీజేపీ ఓ రేంజ్లో దుయ్యబట్టింది. ప్రధాని మోదీ సైతం ఆడియో టేపు వ్యవహారంపై విమర్శలు చేయడం చర్చనీయాంశం మారింది.
అయితే ఈ విషయంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. ఆడియో టేపు వ్యవహారంపై విపక్షాలు విమర్శలు చేస్తోంటే.. తన ఫోన్ను ట్యాప్ చేశారంటూ ఎదురుదాడికి దిగారు. గాల్సీ బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ బీజేపీ తన ఫోన్ను ట్యాప్ చేస్తోందని ఆరోపించారు. వంట చేసుకునే కబుర్లతో సహా తమ సంభాషణలను చోరీ చేస్తోందంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కొందరు ఏజెంట్లతో కుమ్మక్కై ఇలాంటి పనులు చేస్తున్నట్లు తమ వద్ద పక్కా సమాచారం ఉందన్నారు దీదీ. ఫోన్ ట్యాపింగ్పై తమకేమీ తెలియదని బీజేపీ బుకాయించినా అదే నిజం. దీని వెనక కాషాయం పార్టీ ఉంది అని మమతా అన్నారు. ఇందులో ఎవరెవరు ఉన్నారో తమకు తెలుసని.. ఎవర్నీ వదిలేది లేదని ఆమె తీవ్రంగా హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఐడీ విచారణ జరిపిస్తామని.. ఎవర్నీ వదిలేది లేదని మమతా బెనర్జీ హెచ్చరికలు జారీ చేశారు.