"కరోనా రోగులకు ప్రైవేటు ఆస్పత్రులల్లో రిజర్వు బెడ్లు, ప్రభుత్వానికి సహకరించకపోతే ఊరుకోం"

     Written by : smtv Desk | Sat, Apr 17, 2021, 07:06 PM


బెంగళూరులో రోజురోజుకీ కరోనా తీవ్రత పెరుగుతోంది. కరోనా మరణాలు కూడా విపరీతంగా పెరిగిపోవడంతో నగరంలోని శ్మశానాలకు మృతదేహాలు క్యూ కడుతున్నాయి. కరోనా విలయతాండవం చేస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. వైద్యారోగ్య శాఖ నిపుణులతో సమావేశమైన ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రైవేటు ఆస్పత్రులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

కోవిడ్ రోగుల కోసం ప్రైవేటు ఆస్పత్రులు బెడ్లు రిజర్వు చేసి ఉంచాలని మంత్రి సూచించారు. అవసరమైతేనే మిగిలిన రోగులకు బెడ్లు కేటాయించాలని.. వీలైనంత వరకూ కరోనా రోగుల కోసం బెడ్లు రిజర్వ్ చేయాలన్నారు. ప్రభుత్వం ఆస్పత్రుల్లోనూ కోవిడ్ రోగుల కోసం బెడ్లు రిజర్వ్ చేస్తున్నామన్నారు. గత పదిహేను రోజులుగా ప్రభుత్వం చెబుతున్నా ప్రైవేటు ఆస్పత్రులు కేవలం 15 నుంచి 20 శాతం వరకూ మాత్రమే బెడ్లు కోవిడ్ రోగులకు కేటాయిస్తున్నాయని ఆయన అన్నారు.

కరోనా రోగులకు వైద్య సేవలు అందించకపోతే ప్రభుత్వం ఉపేక్షించదని మంత్రి సుధాకర్ హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని.. కఠిన చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని ఆయన తీవ్ర హెచ్చరికలు చేశారు. మిగిలిన రోగులకు అత్యవసరమైతేనే బెడ్లు కేటాయించాలని.. కరోనా రోగుల కోసం బెడ్లు రిజర్వులో ఉంచాలని ఆయన ప్రైవేటు ఆస్పత్రులకు తేల్చి చెప్పారు. ఇలాంటి విపత్కర సమయంలో ఆస్పత్రులు ప్రభుత్వంతో కలసి పనిచేయాలని మంత్రి సూచించారు. కార్పొరేట్ ఆస్పత్రులు స్టార్ హోటళ్లలోనూ కోవిడ్ కేర్ సెంటర్లు నిర్వహించాలని మంత్రి సూచించారు.





Untitled Document
Advertisements