ఏపీలో ఒక్క రోజే 7 వేలకు పైగా కరోనా కేసులు

     Written by : smtv Desk | Sat, Apr 17, 2021, 07:09 PM

ఏపీలో ఒక్క రోజే 7 వేలకు పైగా కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రాష్ట్రంలో కోవిడ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కరోనా వైరస్ సెకండ్‌ వేవ్‌లో మొదటిసారిగా శుక్రవారం 6 వేల కేసులు నమోదుగా.. అదే ఉద్ధృతి కొనసాగిస్తూ 24 గంటల వ్యవధిలోనే 7 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రతి రోజూ వెయ్యికి పైగా కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ మేరకు శనివారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 35,907 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 7,224 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,55,455 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.


అలాగే రాష్ట్రవ్యాప్తంగా 15 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరులో నలుగురు, నెల్లూరులో ముగ్గురు, కర్నూలు, విశాఖలో ఇద్దరు చొప్పున; గుంటూరు, కడప, కృష్ణా, విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున మహమ్మారికి బలయ్యారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,388కి చేరింది. 24 గంటల వ్యవధిలో 2,332 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 9,07,598కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 40,469 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,56,42,070 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ వివరించారు. శనివారం వెలువడిన ఫలితాల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1,051, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 96 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో వరుసగా రెండో రోజూ వెయ్యికిపైగా కేసులు నమోదు కావడం గమనార్హం. తిరుపతి ఉప ఎన్నిక జరుగుతున్న తరుణంలో అక్కడ నిర్వహిస్తున్న ర్యాలీలు, బహిరంగ సభల కారణంగా ఈ కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది.





Untitled Document
Advertisements