క్రీజు పక్కకి వెళ్లిపోయినా.. అలానే బంతి విసిరిన షమీ

     Written by : smtv Desk | Mon, Apr 19, 2021, 03:56 PM

క్రీజు పక్కకి వెళ్లిపోయినా.. అలానే బంతి విసిరిన షమీ

ఐపీఎల్ 2021 సీజన్‌లో బ్యాట్స్‌మెన్, బౌలర్ల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. బంతి బంతికీ మ్యాచ్ గమనం మారిపోయి ఈ ఐపీఎల్‌లో అన్నదమ్ముల (శామ్ కరన్, టామ్ కరన్) మధ్య పోరు కూడా కనువిందు చేసింది. ఇక భారత క్రికెటర్ల మధ్య పోటీ ప్రతి మ్యాచ్‌లోనూ కనిపిస్తోంది. వాంఖడేలో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య ఆదివారం రాత్రి ముగిసిన మ్యాచ్‌లో భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ, ఓపెనర్ శిఖర్ ధావన్ మధ్య కాసేపు ఆధిపత్య పోరు నడిచింది. ఈ క్రమంలో ఓ బంతికి సహనం కోల్పోయిన మహ్మద్ షమీ.. శిఖర్ ధావన్ ఆడకుండా క్రీజు పక్కకి వెళ్లిపోయినా బంతిని విసిరి తన కోపాన్ని ప్రదర్శించాడు. అయితే.. శిఖర్ ధావన్ లైట్ తీసుకోవడంతో ఎలాంటి గొడవ జరగలేదు.

మ్యాచ్‌లో ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన పంజాబ్ బౌలర్ మహ్మద్ షబీ.. మూడో బంతిని విసిరేందుకు రన్నప్ చేసుకుంటూ వచ్చాడు. అయితే.. అతను రన్నప్ మధ్యలో ఉండానే.. స్టేడియంలోని సైట్ స్రీన్ వద్ద ఓ మనిషి తచ్చాడటంతో.. శిఖర్ ధావన్ ఏకాగ్రత చెదిరింది. దాంతో.. శిఖర్ ధావన్ స్టాన్స్ తీసుకోకుండా క్రీజు పక్కకి వెళ్లిపోయాడు. గమనించిన.. ఫీల్డ్ అంపైర్ బౌలింగ్‌ని నిలిపివేయమని చేతులతో సిగ్నల్ ఇస్తున్నా.. మహ్మద్ షమీ పట్టించుకోకుండా అలానే బంతిని ధావన్‌‌కి సమీపంలో విసిరాడు. దాంతో.. ఆశ్చర్యపోయిన శిఖర్ ధావన్ అలానే షమీ పైపు కాసేపు చూస్తూ కనిపించాడు. అయితే.. ఫీల్డ్ అంపైర్ ఆ బంతిని డెడ్ బాల్‌గా ప్రకటించాడు.

ఐపీఎల్ 2014 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఇలానే ముంబయి ఇండియన్స్ పవర్ హిట్టర్ కీరన్ పొలార్డ్‌పైకి బంతిని విసిరాడు. దాంతో.. సహనం కోల్పోయిన పొలార్డ్.. బ్యాట్‌ని మిచెల్ స్టార్క్‌పైకి విసిరాడు. అయితే.. ఆ బ్యాట్ పొలార్డ్‌కి సమీపంలోనే పడటంతో.. ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ.. వాంఖడేలో ఆదివారం రాత్రి శిఖర్ ధావన్ హుందాతనం చాటాడు. ఉద్దేశపూర్వకంగానే షమీ బంతి విసిరినా.. మౌనంగా ఉండిపోయాడు. మ్యాచ్‌లో 49 బంతుల్లోనే 13x4, 2x6 సాయంతో 92 పరుగులు చేసిన ధావన్.. ఢిల్లీని ఒంటిచేత్తో గెలిపించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌ని సొంతం చేసుకున్నాడు.







Untitled Document
Advertisements