ఆక్సిజన్ సరఫరాకు రంగంలోకి రైల్వే శాఖ...ప్రత్యేక ఎక్స్‌పెస్ రైళ్లు

     Written by : smtv Desk | Mon, Apr 19, 2021, 05:03 PM

ఆక్సిజన్ సరఫరాకు రంగంలోకి రైల్వే శాఖ...ప్రత్యేక ఎక్స్‌పెస్ రైళ్లు

దేశంలో కోవిడ్ విజృంభణ తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తొలి దశ కంటే ప్రస్తుతం మహమ్మారి వేగంగా వ్యాప్తిచెందడం, భారీగా పాజిటివ్ కేసులు నమోదుకావడంతో ఆస్పత్రుల్లో పడకల దొరకని పరిస్థితి నెలకుంది. ఆస్పత్రుల్లో బాధితులు భారీగా చేరుతుండటంతో ఆక్సిజన్‌ వినియోగం ఒక్కసారిగా పెరిగింది. పలు చోట్ల ఆక్సిజన్ కొరతతో పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ సరఫరాకు రైల్వేశాఖ నడుం బిగించింది. సోమవారం నుంచి ‘ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌’ రైళ్లను నడపాలని నిర్ణయించింది.

ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆదివారం ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ముంబై సమీపంలోని కలంబోలి, బోయ్సర్‌ స్టేషన్ల నుంచి సోమవారం ఉదయం ఖాళీ ఆక్సిజన్‌ ట్యాంకర్లతో రెండు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు బయలుదేరుతాయి. మెడికల్‌ ఆక్సిజన్‌ లభ్యత అధికంగా ఉండే విశాఖపట్నం, జంషేడ్‌పూర్‌, రూర్కెలా, బోకరో ప్రాంతాల నుంచి ప్రాణవాయువును తీసుకువస్తాయి. ఈ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పూర్తిగా ‘గ్రీన్‌చానల్‌’ మార్గంలో పయనించనున్నాయి. ఈ రైళ్లు వస్తున్నప్పుడు ఆ మార్గంలో వచ్చే షెడ్యూల్‌ రైళ్లను కూడా నిలిపివేస్తారు.

ఆయా మార్గాల్లో ఉండే రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జిల ఎత్తును దృష్టిలో పెట్టుకుని, 1.29 మీటర్ల ఎత్తుండే వ్యాగన్లపైన.. 3.32 మీటర్లలోపు ఎత్తు ఉన్న ఆక్సిజన్‌ ట్యాంకర్‌ ట్రక్కులను తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు భారతీయ రైల్వే అధికారులు ఆదివారం తెలిపారు. ప్రస్తుతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు ఈ సేవలను అందిస్తున్నారు.

రోల్ ఆన్-రోల్ ఆఫ్ (రోరో) సేవ ద్వారా ఎల్‌ఎంఓ ట్యాంకర్లను రవాణాకు అనుమతించాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను రైల్వే బోర్డు శుక్రవారం ఆమోదించింది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్ని జోన్ల జనరల్ మేనేజర్లను రైల్వే బోర్డు ఆదేశించింది. ‘‘కొన్ని ప్రదేశాలలో రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, ఓవర్ హెడ్ పరికరాల పరిమితుల కారణంగా 3.32 మీటర్ల ఎత్తు ఉండే T-1618 ట్యాంకర్లను తీసుకెళ్లాలని నిర్ణయించాం’’ అని పేర్కొంది.





Untitled Document
Advertisements