"తల్లికి కరోనా...ఆస్పత్రి ఖర్చుల డబ్బులు చోరీ"...విషాద ఘటన

     Written by : smtv Desk | Mon, Apr 19, 2021, 05:08 PM


రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై బతికే చిరువ్యాపారికి కరోనా రూపంలో కష్టమొచ్చింది. కన్నతల్లికి కరోనా పాజిటివ్ అని తెలియడంతో ఆమెను ఇంట్లో ఉంచి డబ్బుల కోసం తిరిగాడు. ఆస్పత్రిలో చేర్పించేందుకు తెలిసిన వాళ్లందరినీ అడిగి మూడు లక్షల రూపాయలు అప్పు తెచ్చాడు. ఇంటికెళ్లేప్పుడు తీసుకెళ్దామని తన బైక్ డిక్కీలో పెట్టుకుని ఆమ్లెట్లు వేయడం మొదలుపెట్టాడు. పని ముగించుకుని ఇంటికెళ్లి డిక్కీ ఓపెన్ చేస్తే ఊహించని షాక్ ఎదురైంది. అందులో పెట్టిన డబ్బులు కనిపించకపోవడంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషాద ఘటన గుజరాత్‌లో జరిగింది.

రాజ్‌కోట్ జిల్లా ఖోడియార్‌నగర్ ఏరియాకి చెందిన మనోజ్ పటేల్(28) ఫుట్‌పాత్‌పై ఆమ్లెట్లు వేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల అతని తల్లి కరోనా వైరస్ బారినపడింది. ఏం చేయాలో దిక్కుతోచని మనోజ్.. ఆమెను ఇంట్లోనే ఉంచి దుకాణానికి వెళ్లాడు. ఆస్పత్రిలో చేర్పించేందుకు తెలిసిన వారందరినీ అడిగి రూ.3 లక్షలు అప్పుగా తీసుకొచ్చాడు. వాటిని తన బైక్ డిక్కీలో పెట్టుకుని లాక్ చేసి ఆమ్లెట్లు వ్యాపారం ప్రారంభించాడు. రాత్రి పని ముగించుకుని ఇంటికి వెళ్లి డిక్కీ ఓపెన్ చేయడంతో దిమ్మతిరిగిపోయింది.

అందులో ఉంచిన రూ.2.95 లక్షలు కనిపించలేదు. ఓ వైపు తల్లికి కరోనా.. మరోవైపు ఆస్పత్రి ఖర్చులకు తెచ్చిన డబ్బులు చోరీకి గురవడంతో కుంగిపోయాడు. చివరిగా తన దుకాణానికి వచ్చిన యువకులే డబ్బులు కొట్టేసి ఉంటారని అనుమానించి పోలీసులను ఆశ్రయించాడు. అమ్మ కరోనా ట్రీట్‌మెంట్ కోసం అప్పుగా తెచ్చిన డబ్బులు చోరీ చేశారని వాపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.





Untitled Document
Advertisements