RCB హ్యాట్రిక్...షాక్ లో ఫ్యాన్స్

     Written by : smtv Desk | Mon, Apr 19, 2021, 06:14 PM

RCB హ్యాట్రిక్...షాక్ లో ఫ్యాన్స్

ఐపీఎల్ 2021 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జైత్రయాత్ర కొనసాగుతోంది. తాజా సీజన్‌లో ఇప్పటి వరకూ మూడు మ్యాచ్‌లాడిన బెంగళూరు.. మూడింటిలోనూ సునాయాస విజయాల్ని అందుకుంది. దాంతో.. పాయింట్ల పట్టికలోనూ టాప్‌లోకి ఆర్సీబీ దూసుకెళ్లింది. 14 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఓ రెండు మూడు సీజన్లు మినహా.. ఈ స్థాయిలో పాయింట్ల పట్టికలో బెంగళూరు.. అదీ ఆరంభంలోనే ఆధిపత్యం చెలాయించలేదు. ఐపీఎల్ 2021 సీజన్‌లో ఇప్పటికే 11 మ్యాచ్‌లు ముగియగా.. ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోని ఏకైక జట్టు బెంగళూరు మాత్రమే కావడం గమనార్హం. దాంతో.. నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008 నుంచి ‘ఈసాల కప్ నమ్దే’ అంటూ బరిలోకి దిగడం.. ఆఖరికి ఉసూరమనిపించడం గత కొన్నేళ్లుగా ఆర్సీబీకి పరిపాటిగా మారిపోయింది. ఇప్పటికే మూడు సార్లు ఫైనల్‌కి చేరిన ఆ జట్టు కనీసం ఒక్కసారి కూడా టైటిల్ విజేతగా నిలవలేకపోయింది. మిడిలార్డర్‌లో నిలకడగా ఆడే బ్యాట్స్‌మెన్‌లు లేకపోవడం.. బౌలింగ్ బలహీనత ఆ జట్టుని దెబ్బతీస్తో వస్తోంది. కానీ.. ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆర్సీబీ ఆ తప్పిదాల్ని పూర్తి స్థాయిలో దిద్దుకున్నట్లు కనిపిస్తోంది. పవర్ హిట్టర్ గ్లెన్ మాక్స్‌వెల్, ఫాస్ట్ బౌలర్ జెమీషన్ రాకతో టీమ్‌లో మంచి సమతూకం ఏర్పడింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో అన్ని జట్లూ 150-160 స్కోర్లు చేసేందుకు ఆపసోపాలు పడుతుండగా.. బెంగళూరు మాత్రం ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఏకంగా 204 పరుగులు చేయగలిగింది. మ్యాచ్‌లో మొదట 49 బంతుల్లోనే మాక్స్‌వెల్ 78 పరుగులతో భారీ స్కోరుకి బాటలు చేయగా.. చివర్లో ఏబీ డివిలియర్స్ స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించి 34 బంతుల్లోనే 76 పరుగులు చేయగలిగాడు. బౌలింగ్‌లోనూ జెమీషన్ మూడు వికెట్లు పడగొట్టగా.. హర్షల్ పటేల్ యార్కర్లతో ప్రత్యర్థుల్ని బెంబేలెత్తిస్తున్నాడు. దాంతో.. తాజా సీజన్‌లో ఆర్సీబీ అన్ని విభాగాల్లోనూ తిరుగులేని జట్టుగా కనిపిస్తోంది. టోర్నీ ఫస్ట్ మ్యాచ్‌లోనే ముంబయి ఇండియన్స్‌ని 2 వికెట్ల తేడాతో ఓడించిన బెంగళూరు.. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 6 పరుగుల తేడాతో గెలిచింది. తాజాగా కోల్‌కతాపైనా 38 పరుగుల తేడాతో గెలవడం ద్వారా.. నెట్‌ రన్‌రేట్‌లోనూ అన్ని జట్ల కంటే మెరుగ్గా బెంగళూరు ఉంది.






Untitled Document
Advertisements