ఆంధ్రాలో కిలో చేపలు @40/-

     Written by : smtv Desk | Mon, Apr 19, 2021, 06:46 PM

ఆంధ్రాలో కిలో చేపలు @40/-

ఆంధ్రప్రదేశ్ చేపల ధరలు దారుణంగా పడిపోయాయి. పశ్చిమ గోదావరి ఆకివీడు చేపల మార్కెట్‌లో చేపల రేటు ఏకంగా కిలో 40 నుంచి 50 రూపాయలకు పడిపోయింది. కిలో 120 రూపాయలు ఉండే చేపల ధర దారుణంగా పడిపోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. గిట్టుబాటు ధర లేక పెంపకందారులు భారీగా నష్టపోతున్నారు.

కాగా, ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో చేపలకు డిమాండ్‌ ఉన్నా.. చేపల ఎగుమతులపై కరోనా వైరస్ మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతోంది. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో విధించిన ఆంక్షలు చేపల ఎగుమతి, మార్కెటింగ్‌కు అవరోధంగా మారాయి. కొన్ని పట్టణాల్లో మార్కెట్లు మూతపడటంతో ఎగుమతులు తగ్గాయి. ఇంతకు ముందు రాష్ట్రం నుంచి రోజుకు 200 లారీలకు పైగా చేపలు ఈశాన్య రాష్ట్రాలకు పంపేవారు.

అయితే, కరోనా ప్రభావం వల్ల ఇప్పుడు ఎగుమతులు సగానికి తగ్గాయి. దీంతో 15 రోజుల్లోనే చేపల ధర టన్నుకు రూ.10 వేల నుంచి రూ. 15 వేల వరకు తగ్గింది. టన్ను చేపల ధర దాదాపు రూ. 85 వేల నుంచి రూ. 70 వేల రూపాయలకు పడిపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో టన్ను రూ. 1.10 లక్షల నుంచి రూ.1.20 లక్షల వరకూ పలికింది. అలాగే ఈ ఏడాది ప్రారంభంలో కిలో చేపలు రూ.110- 120 వరకు ఉండగా.. ఇప్పుడు రూ.70కి మించి పలకడం లేదు. సాధారణంగా ఈ సమయంలో కిలో ధర రూ.150 పైగా ఉంటుందని భావించారు. కానీ, ఎగుమతులు తగ్గడంతో ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.

దీనికితోడు గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌లో చేపలు మార్కెట్‌కు వస్తుండటంతో ఈశాన్య రాష్ట్రాలకు రాష్ట్రం నుంచి చేపల ఎగుమతి తగ్గినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ, ఢిల్లీ మార్కెట్లకు మాత్రం సాధారణంగానే వెళ్తున్నాయి. అలాగే వన్నామి రకం రొయ్యల ధరలు కూడా ఇతర రాష్ట్రాల కన్నా ఏపీలో తక్కువగానే ఉన్నాయి. 25 కౌంట్‌ రొయ్యలు గుజరాత్‌లో రూ. 520 ఉండగా, రాష్ట్రంలో రూ.500కు అడుగుతున్నారు. 33 కౌంట్‌కు గుజరాత్‌లో రూ. 435 ఉండగా, రాష్ట్రంలో రూ.360 లభిస్తున్నాయి. కరోనా ప్రభావంతో చేపలు ధరలు భారీగా పడిపోవడంతో మత్స్య రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.





Untitled Document
Advertisements