యూఏఈలో వరల్డ్‌కప్‌ టోర్నీ?!

     Written by : smtv Desk | Thu, May 06, 2021, 04:34 PM

యూఏఈలో వరల్డ్‌కప్‌ టోర్నీ?!

ఐపీఎల్ 2021 సీజన్‌ వాయిదా నేపథ్యంలో భారత్ వేదికగా ఈ ఏడాది జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్‌పై కూడా సందిగ్ధత నెలకొంది. ఐపీఎల్‌లోని నాలుగు జట్లలో కరోనా కేసులు నమోదవడంతో.. టోర్నీని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిరవధికంగా ఈరోజు వాయిదా వేసింది. దాంతో.. ఈ ఏడాది అక్టోబరు- నవంబరులో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్‌‌ని భారత్‌‌లో నిర్వహించడంపై సందేహాలు నెలకొన్నాయి.

ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్‌ ఆతిథ్య హక్కులు ప్రస్తుతం భారత్ వద్ద ఉండగా.. మొత్తం 16 దేశాలకి చెందిన జట్లు ఇక్కడికి వచ్చి టోర్నీలో ఆడబోతున్నాయి. ఈ మేరకు వరల్డ్‌కప్‌ కోసం బయో- సెక్యూర్ బబుల్‌ని క్రియేట్ చేయాలని యోచిస్తున్న బీసీసీఐ.. ఐపీఎల్ 2021 సీజన్‌ బయో- సెక్యూర్ బబుల్‌ని ఉదాహరణగా చూపాలని ఆశించింది. కానీ.. అనూహ్యంగా ఐపీఎల్ 2021 సీజన్ బబుల్‌లోని క్రికెటర్లకి కరోనా రావడంతో.. ఇప్పుడు బీసీసీఐ పునరాలోచనలో పడింది.

ఐపీఎల్ 2021 సీజన్‌ని సమర్థవంతంగా నిర్వహించలేక నిరవధికంగా వాయిదా వేయడం ద్వారా.. టీ20 వరల్డ్‌కప్‌ కోసం ఇక్కడికి వచ్చే జట్ల నమ్మకాన్ని బీసీసీఐ కోల్పోయింది. దాంతో.. యూఏఈ వేదికగా వేదికగా టీ20 వరల్డ్‌కప్‌ని నిర్వహించడానికి ఉన్న అవకాశాల్ని బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌ల్ని కూడా యూఏఈలోనే నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఐపీఎల్ 2020 సీజన్‌ని యూఏఈ వేదికగా బీసీసీఐ విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే.





Untitled Document
Advertisements