2 గంటల 53 నిమిషాలు

     Written by : smtv Desk | Thu, May 06, 2021, 05:35 PM

2 గంటల 53 నిమిషాలు

కన్నడ సినిమా స్థాయిని యావత్ ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రం ‘కే.జీ.ఎఫ్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాక్‌స్టార్ యశ్ హీరోగా నటించిన ఈ చిత్రం మొత్తం ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఒక సినిమా ఇలా కూడా తీయొచ్చా అని దర్శక నిర్మాతలు అవాక్కయ్యేలా సినిమాని రూపొందిచాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. మాస్ ఫైట్లు, ఓ రేంజ్ ఎలివేషన్లతో సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘కే.జీ.ఎఫ్-ఛాప్టర్ 2’ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మొదటి భాగంలో చూసిన ప్రతీ ఒక్కరు ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

ఇక కొన్ని నెలల క్రితం విడుదలైన సినిమా టీజర్.. అంచనాలను మరింతగా పెంచేసింది. ఈ టీజర్‌తో ఛాప్టర్ 2 సినిమా ఎలా ఉండబోతుందా అనే చిన్న ట్రయల్ చూపించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. అయితే సినిమా ప్రకటించినప్పటి నుంచి దీనికి సంబంధించి రోజుకో వార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ట్రెండ్ అవుతోంది. అదేంటే.. సినిమాను ఎలాంటి కట్స్ లేకుండా.. 2 గంటల 53 నిమిషాల నిడివితో ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. అంతసేపు థియేటర్‌లో ప్రేక్షకులను కూర్చొబెట్టే స్క్రీన్‌ప్లే ఉన్న కారణంగానే సినిమాలను అలా రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్త ఎంతవరకూ నిజమనే విషయంలో క్లారిటీ లేదు.

ఇక ఈ సినిమాతో ప్రధాన విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నాడు. యశ్, సంజయ్ దత్‌ల మధ్య నడిచే యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా ఉండనున్నాయనే టాక్ వినిపిస్తుంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో రవీనా టండన్, ప్రకాశ్ రాజ్, అనంత్ నాగ్, రావు రమేశ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది జూలై 16న సినిమాను విడుదల చేస్తామని తొలుత ప్రకటించారు. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితుల్లో సినిమా విడుదల వాయిదాపడే అవకాశం ఉంది.





Untitled Document
Advertisements