సాహాకి కరోనా... కూతురు అన్వి ఎమోషనల్ స్కెచ్‌

     Written by : smtv Desk | Thu, May 06, 2021, 06:50 PM

సాహాకి కరోనా... కూతురు అన్వి ఎమోషనల్ స్కెచ్‌

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆడుతూ కరోనా వైరస్ బారినపడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ సాహా నెమ్మదిగా కోలుకుంటున్నాడు. ఇప్పటికే ఐపీఎల్ 2021 సీజన్ వాయిదాపడగా.. విదేశీ క్రికెటర్లతో పాటు.. భారత క్రికెటర్లు కూడా ఐపీఎల్ బబుల్‌ని వీడి తమ ఇళ్లకి బయల్దేరి వెళ్లారు. కానీ.. కరోనా బారినపడిన సాహాతో పాటు అమిత్ మిశ్రా, వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ క్వారంటైన్‌‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఢిల్లీలో చికిత్స తీసుకుంటున్న సాహాకి అతని ఎనిమిదేళ్ల కూతురు అన్వి ఎమోషనల్ స్కెచ్‌తో పాటు ఒక మెసేజ్‌ని కూడా పంపింది.

సాహాని సూపర్ మ్యాన్‌గా అభివర్ణించిన అన్వి.. కరోనాతో అతను ఫైట్ చేస్తున్నట్లు స్కెచ్ గీసింది. అందులో గెట్‌వెల్ సూన్ బాబా అంటూ మెసేజ్ కూడా రాసింది. తాజాగా ఈ స్కెచ్‌ని అభిమానులతో సాహా పంచుకున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్‌ కఠినమైన బయో- సెక్యూర్ బబుల్‌లో ఉన్న సాహాకి కరోనా వైరస్ ఎలా సోకింది..? అని సన్‌రైజర్స్ హైదరాబాద్ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ ఆశ్చర్యం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ఐపీఎల్ 2021 సీజన్‌లో సాహా కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఐపీఎల్ 2020 సీజన్‌లో ఓపెనర్‌గా క్లిక్ అయిన సాహాని.. ఈ ఏడాది కూడా ప్రయోగాత్మకంగా ఓపెనర్‌గా ఆడించారు. కానీ.. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో కేవలం 8 పరుగులే సాహా చేశాడు. దాంతో.. ఆ తర్వాత ఐదు మ్యాచ్‌ల్లోనూ అతనిపై వేటు పడింది. రిజర్వ్ బెంచ్‌పై ఉండగానే సాహాకి కరోనా వైరస్ సోకడం గమనార్హం.





Untitled Document
Advertisements