"మీడియాను నియంత్రించలేం"

     Written by : smtv Desk | Thu, May 06, 2021, 06:55 PM


న్యాయస్థానాల్లో జరిగే విచారణలను నివేదించకుండా మీడియాను నియంత్రించాలని కేంద్ర ఎన్నికల సంఘం చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈసీ పిటిషన్‌పై విచారణను పూర్తిచేసిన సర్వోన్నత న్యాయస్థానం.. గురువారం కొట్టివేసింది. మీడియాపై ఫిర్యాదు చేసి వాటికి సంకెళ్లు వేయాలని రాజ్యాంగబద్ధ సంస్థలు కోరడం కంటే.. మరింత ఉన్నతంగా వ్యవహరించవచ్చని కోర్టు అభిప్రాయపడింది. ‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్-19 కేవలం ప్రజలకు మాత్రమే భావ ప్రకటన హక్కును కల్పించలేదు.. ఈ హక్కు మీడియాకు కూడా ఉంది... మీడియాను సుప్రీంకోర్టు నిషేధించడం తిరోగమనం అవుతుంది’’ అని పేర్కొంది.

‘‘కోర్టు కార్యకలాపాలను నివేదించకుండా మీడియాను నిరోధించాలని ఈసీ చేసిన అభ్యర్థన సహేతుకంగా లేదు.. న్యాయవ్యవస్థకు జవాబుదారీగా ఉండటం చాలా అవసరం’’ అని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఇటీవల మద్రాస్‌ హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై కూడా సుప్రీంకోర్టు స్పందించింది.

ఆ వ్యాఖ్యలు కొంత కఠినంగానే ఉన్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే, తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశమున్న అంశాల్లో హైకోర్టులు కొంత నిగ్రహం పాటించి సంయమనంతో వ్యవహరించాలని సూచించింది. రాజ్యాంగబద్ద సంస్థకు న్యాయ భాష ముఖ్యం. న్యాయ సమీక్షకు శక్తి చాలా ఎక్కువగా ఉంది.. అది ప్రాథమిక నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. రాజ్యాంగ స్వేచ్ఛకు న్యాయస్థానాలు రక్షణ కవచం.. పత్రికా స్వేచ్ఛ అనేది రాజ్యాంగబద్ధమైన వాక్, భావ ప్రకటనా స్వేచ్ఛలో ఒక అంశం అని వివరించింది.

దేశంలో కొవిడ్‌-19 కేసుల పెరుగుదలకు కేంద్ర ఎన్నికల సంఘానిదే బాధ్యత అని, వారిపై హత్యానేరం కింద కేసు నమోదుచేయాలని మద్రాస్‌ హైకోర్టు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో ఈసీ ఫిర్యాదు చేసింది. ఈ పిటిషన్‌పై గురువారం తీర్పు వెలువరించింది. కోర్టుల్లో జరిగే విచారణను నివేదించకుడా మీడియాను నిలువరించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. న్యాయస్థానాల్లో జరిగే అంశాలను బాహ్య ప్రపంచానికి తెలిపే స్వేచ్ఛ మీడియాకు ఉందని వ్యాఖ్యానించింది. ఇలా చేయకుండా మీడియాను నిలువరించలేమని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది.





Untitled Document
Advertisements