ఏపీకి బస్సులు బంద్

     Written by : smtv Desk | Thu, May 06, 2021, 06:57 PM

ఏపీకి బస్సులు బంద్

కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తూ రాన్రానూ కేసులు పెరిగిపోతున్న వేళ ఏపీ ప్రభుత్వం పగటి పూట కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే అన్ని బస్సులను టీఎస్‌ఆర్టీసీ రద్దు చేసింది. ఉదయం నుండి వెళ్లే బస్సులు మధ్యాహ్నానికి చేరుకునే అవకాశం లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ వెల్లడించారు. తెలంగాణ, ఏపీ మధ్య పూర్తిగా మెడికల్ ఏమర్జెన్సీ ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతిస్తారని తెలిపారు.

తెలంగాణ నుండి ఏపీ మీదుగా వెళ్లే ఇతర రాష్ట్రాలకు వెళ్లే మిగతా వాహనాలు కూడా నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని వివరించారు. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే దాదాపు 250 బస్సులను తెలంగాణ ఆర్టీసీ రద్దు చేసింది. ముందస్తు రిజర్వేషన్‌లను కూడా అధికారులు రద్దు చేశారు.

కరోనా కట్టడిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో పగటి పూట కర్ఫ్యూ కఠినంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి తిరిగి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉన్నందువల్ల ముఖ్యంగా అంతరాష్ట్ర సరిహద్దుల దగ్గర మాత్రం పరిస్థితి మాత్రం కాస్త గందరగోళంగా మారింది. మధ్యాహ్నం 12 దాటిన తర్వాత ఎలాంటి వాహనాలకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. మధ్యాహ్నం 12 గంటలలోపే అనుమతి అంటూ తిరిగి వెనక్కు పంపిచేస్తున్నారు. ముందస్తు అనుమతి ఉంటే మాత్రమే ఏపీ సరిహద్దు దాటి లోపలికి రానిస్తున్నారు.





Untitled Document
Advertisements