న్యూ డిల్లీ, డిసెంబర్ 22: పెట్రోల్, డీజిల్ తో నడిచే కార్లకు కాలం చెల్లుతోందని చెబుతోంది దేశీయ దిగ్గజ కార్ల కంపెనీ 'మారుతీ సుజుకీ'. 2020 నాటికి తొలి ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. అందుబాటు ధరలో ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావడమనేది పరిశ్రమ ముందున్న అతిపెద్ద సవాలని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్.సి.భార్గవ తెలిపారు. ఈవీల బ్యాటరీలు, ఇతర వాహన విడిభాగాలను దేశీయంగానే తయారు చేయగలిగితే ఈ సమస్యను అధిగమించవచ్చని అయన చెప్పారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీలు)పై 2–3 వారాల్లో సొంతంగా ఒక సర్వే నిర్వహి౦చి, వినియోగదారుల అభిప్రాయాలకు అనుగుణంగా ముందుకు వెళ్తామని ఆయన పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వ మద్దతు, సహకారం అవసరమని అయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్ ఎలక్ట్రిక్ వాహనలదేనని అయన జోస్యం చెప్పారు.