న్యూఢిల్లీ, డిసెంబర్ 24 : దేశీయ విమానయాన సంస్థ ఎయిర్డెక్కన్ తన సెకండ్ ఇన్నింగ్స్ను ఆరంభించింది. నేటి నుంచి ఈ సంస్థ తన సేవలను తిరిగి ప్రారంభించింది. తక్కువ ధరలకే విమాన ప్రయాణాన్ని అందించే లక్ష్యంతో 2003లో జీ.ఆర్. గోపినాథ్ ఎయిర్డెక్కన్ విమానయాన సంస్థను స్థాపించారు. తర్వాత 2008లో ప్రముఖ వ్యాపారవేత్త విజయ్మాల్యాకు చెందిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్లో ఈ సంస్థ విలీనమైంది. అనంతరం ఆర్ధిక కారణాల వల్ల 2012లో ఎయిర్డెక్కన్ సర్వీసులను రద్దు చేశారు. మళ్లీ ఇప్పుడు ముంబయిలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి ఎయిర్డెక్కన్ తొలి విమానం డీఎన్ 1320 మహారాష్ట్రలోని జల్గావ్ బయలుదేరింది.
రెండో ఇన్నింగ్స్ తొలి దశలో భాగంగా ముంబయి- జల్గావ్, ముంబయి- నాసిక్, ముంబయి- కోల్హాపూర్, పుణె-జల్గావ్, పుణె-నాసిక్, పుణె-కోల్హాపూర్ మార్గాల్లో విమానాలను నడపనున్నారు. ఈ విషయంపై సంస్థ ఛైర్మన్ కెప్టెన్ జీఆర్ గోపినాథ్ మాట్లాడుతూ..."ఇది ఘనమైన ఆరంభం. ఎయిర్డెక్కన్ హవా మళ్లీ ప్రారంభమైంది" అని వ్యాఖ్యానించారు.