ముంబై, డిసెంబర్ 24 : రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) ...ప్రస్తుత భారత్ విపణిలోనే అగ్రగామిగా ఒక వెలుగు వెలుగుతున్న సంస్థ...కానీ ఈ సంస్థ అభివృద్ధి కోసం ముకేష్ అంబానీ తండ్రి దివంగత ధీరూభాయ్ అంబానీ ఎన్నో కష్టాలు పడి, శ్రమనే పెట్టుబడిగా పెట్టి నడిపించారు. తాజాగా ఈ కంపెనీ ఏర్పడి 40 వసంతాలు పూర్తి చేసుకోవడమే కాకుండా, మరోవైపు తాను ఈ స్థాయికి ఎదగడానికి తొలి అడుగులు నేర్పించిన తండ్రి ధీరూభాయి అంబానీ జయంతి (28న) ఇంకో నాలుగు రోజుల్లో జరగనుంది. అందుకే ఈ రెండు సందర్భాలను పురస్కరించుకొని ఓ చిరస్మరణీయ వేడుకకు శ్రీకారం చుట్టారు ముకేశ్ అంబానీ. ఆ వేడుక పేరు 'రిలయన్స్ ఫ్యామిలీ డే'. 'ఓ కుటుంబం కలిసి పనిచేస్తుంది.. కలిసి వేడుకలు చేసుకుంటుంది' అని ట్యాగ్ లైన్. శనివారం ఈ కార్యక్రమ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
ముకేశ్ నిర్వహిస్తోన్న ఇంతటి వేడుకకి వేదిక నవీ ముంబయిలోని రిలయన్స్ కార్పొరేట్ పార్క్లో నిర్మించిన కొత్త మైదానం. ఇక్కడ విశేషమేమిటంటే లండన్లోని లార్డ్స్ మైదానం కంటే ఇది పెద్దది. అంతేకాదు ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా 1200 ప్రదేశాల్లోని తన ఉద్యోగులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసే వెసులుబాటును కూడా రిలయన్స్ గ్రూపు కల్పించడం గమనార్హం. ఈ వేడుకకు ముకేశ్ తల్లి కోకిలాబెన్. భార్య నీతా అంబానీ, కుమార్తె ఈశా, తనయులు ఆకాశ్, అనంత్ సహా ముకేశ్ కుటుంబ సభ్యులు, బంధువులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. అంతే కాకుండా బాలీవుడ్ సూపర్స్టార్లు అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్ తమ ప్రసంగంతో అలరించారు.
ధీరుభాయ్ దార్శనిక త, లక్ష్యాలు, సూత్రాలకు రిలయన్స్ గ్రూప్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా ముకేశ్ అన్నారు. రూ. 1,000తో ప్రారంభమైన కంపెనీ నేడు రూ. 6 లక్షల కోట్ల స్థాయికి చేరుకుంది. 1977లో ఆర్ఐఎల్లో రూ. 1,000 పెట్టుబడి చేసిన వారి ప్రస్తుత విలువ 2009 రెట్లు పెరిగి రూ. 20.9 లక్షల స్థాయికి ఎదిగింది. ప్రపంచంలోని టాప్ 20 కంపెనీల్లో రిలయన్స్ను నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడించారు.