అడవిలో అపహరణకు గురైన సీత జాడకై రామలక్ష్మణులు ఇద్దరూ అడవిలో వెతుకుతూ ఉండగా వారికి రెక్కలు తెగి రక్తంలో తడిసి కోన ఊపిరితో ఉన్న జటాయువు కనిపించాడు. "సీతను రావణుడు బలవంతంగా లంకాపురానికి ఎత్తుకుపోయా"డని రామలక్ష్మణులకు చెప్పి ప్రాణాలు వదిలాడు ఆ పక్షిరాజు. జటాయువు దహన సంస్కారాలు నిర్వహించిన పిమ్మట సీతాన్వేశానకై మరికొంత దూరము నడిచిన తరువాత రామలక్ష్మణుల మార్గమునకు కబంధుడు అనే రాక్షసుడు అడ్డుపడి అమాంతముగా ఇద్దరినీ రెండు చేతులతో పట్టుకున్నాడు. అనుకోని ఈ అవాంతరమునకు అన్నదమ్ములిద్దరూ ముఖముఖాలు చూచుకున్నారు. అప్పుడు శ్రీరాముడు రాక్షసుని చేతులలో ఉన్నామని తెలుసుకుని బాణం సంధించి అతని చేతులు నరికాడు. ఆ దెబ్బతో కబంధునికి శాప విమోచనమై ఒక దివ్య పురుషునిగా మారి, శ్రీరామలక్ష్మణులకు ప్రాణమములు చేశాడు. తానొక గంధర్వుడననీ, శాపం చేత కబంధునిగా మారి ఈ ప్రాంతములో ఒంటరిగా బ్రతుకుతున్నానని చెప్పాడు. "నేటికి మీ దయ వలన నాకు శాప విమోచనం కలిగిందని" చెప్పి రామలక్ష్మణుల ద్వారా విషయం తెలుసుకొని "శ్రీరామ చంద్రా! సుగ్రీవుడనే వానరరాజు ఋష్యమూక పర్వతం మీద ఉంటున్నాడు. సీతమ్మను తీసుకొనివచ్చుటకు అతని సహాయం నీకు ఎంతైనా అవసరం అవుతుంది. కనుక మీకు సుగ్రీవుని మైత్రి విజయాన్ని చేకూరుస్తుంది. అతనిని కలుసుకొమ్మ" ని చెప్పి వెళ్ళిపోయాడు ఆ గంధర్వుడు.