న్యూఢిల్లీ, డిసెంబర్ 27: సోషల్ మీడియాలో దిగ్గజమైన వాట్సాప్, అందులోని ఎమోజీలు యూజర్లకు ఎంతగా ఉపయోగపడుతాయో అందరికీ తెలిసిందే. తాజాగా ఓ న్యాయవాది అందులోని ఓ ఎమోజీపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ మెసేజింగ్ యాప్ వాట్సాప్కు లీగల్ నోటీసులు పంపారు.
ఢిల్లీ సిటీ కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తున్న గుర్మీత్ సింగ్, వాట్సాప్లో ఉన్న మధ్య వేలు ఎమోజీని తొలగించాలని అందులో సూచించారు. ఆ ఎమోజీ అసభ్యకర సందేశానికి సంకేతమని, దాన్ని వెంటనే తొలగించాలని లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. ఐపీసీ సెక్షన్ 354,509 ప్రకారం అశ్లీల, అసభ్యకర సంజ్ఞలను చూపడం చట్టరీత్యా నేరమని తెలిపారు. 15 రోజుల్లో సదరు ఎమోజీని తొలగించాలని నోటిసులో తెలిపారు.