MI ఓటమికి కారణం ఇదే!?

     Written by : smtv Desk | Fri, Sep 24, 2021, 11:41 AM

MI ఓటమికి కారణం ఇదే!?

కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో గురువారం రాత్రి ఓటమికి గల కారణాల్ని ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. అబుదాబి వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో డికాక్ హాఫ్ సెంచరీ బాదడంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఆ తర్వాత.. కోల్‌కతా జట్టులో రాహుల్ త్రిపాఠి (74 నాటౌట్: 42 బంతుల్లో 8x4, 3x6), వెంకటేశ్ అయ్యర్ (53: 30 బంతుల్లో 4x4, 3x6) మెరుపు హాఫ్ సెంచరీలు బాదడంతో.. ఆ జట్టు 15.1 ఓవర్లలోనే 159/3తో విజయాన్ని అందుకుంది. సీజన్‌లో 9వ మ్యాచ్ ఆడిన కోల్‌కతా టీమ్‌కి ఇది నాలుగో గెలుపుకాగా.. ముంబయి ఇండియన్స్‌కి ఇది ఐదో ఓటమి.

ముంబయి మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌లు తడబడిన పిచ్‌పై కోల్‌కతా ఆటగాళ్లు రాహుల్ త్రిపాఠి, వెంకటేశ్ అయ్యర్ స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించేశారు. దెబ్బకి ముంబయి అగ్రశ్రేణి పేసర్లు బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ సైతం ఓవర్‌కి 10 పరుగులపైనే సమర్పించుకున్నారు. అంతకముందు బంతి చక్కగా బ్యాట్‌పైకి వస్తున్నా.. సూర్యకుమార్ యాదవ్ (5), ఇషాన్ కిషన్ (14)‌తో పాటు కీరన్ పొలార్డ్ (21) భారీ షాట్లు ఆడలేకపోయారు. దాంతో.. 155 పరుగులతోనే ముంబయి సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ.. లక్ష్యాన్ని మరో 29 బంతులు మిగిలి ఉండగానే కోల్‌కతా ఛేదించేయడం గమనార్హం.

‘‘పిచ్ బ్యాటింగ్‌కి బాగా అనుకూలించింది. ముంబయి టీమ్‌కి కూడా మెరుగైన ఆరంభం లభించింది. కానీ.. మిడిలార్డర్ వైఫల్యం కారణంగా.. ఆ స్టార్ట్‌ని భారీ స్కోరుగా మలచలేకపోయాం. అలానే బౌలింగ్‌లోనూ మాకు ఏవీ కలిసిరాలేదు. స్టంప్ టు స్టంప్ బౌలింగ్ చేయడం ద్వారా కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌లు రిస్క్‌లు తీసుకునేలా చేయాలనుకున్నాం. కానీ.. ఆ ప్లాన్ వర్క్‌వుట్ అవలేదు. పాయింట్ల టేబుల్‌ మా మైండ్‌లో ఉంది.. ఇప్పుడు ఏ ప్లేస్‌లో ఉన్నామో గుర్తించుకోవడం కూడా ముఖ్యమే’’ అని రోహిత్ శర్మ వెల్లడించాడు.





Untitled Document
Advertisements