సీతాన్వేషణలో సుగ్రీవుని మైత్రి విజయాన్ని చేకూరుస్తుందని చెప్పిన కబంధుని మాటలతో సుగ్రీవుని జాడకై వెతుకుతూ అరణ్యములో రామలక్ష్మణులు చాలా దూరం నడిచి పంపా సరస్సు వైపు వెళ్లారు. ఆ నదీ తీరమున వారికి ఒక చిన్న తాటి ఆకులతో నిర్మించిన ఒక కుటీరము కనిపించింది. అక్కడకు వెళ్ళగా తలనెరసి ముగ్గు బుట్టలా ఉండి, నడుము వంగిన ఒక పండు ముసలమ్మ కనిపించింది. ఆమె శబరి, రామలక్ష్మణులు ఆమె దగ్గరకు వెళ్లారు. ఆ అన్నదమ్ములను చూసిన శబరి పరమానందపడి "నాయనా! రామా ! నీ కోసమే ఎదురుచూస్తున్నాను. ఎంతకాలానికి కరుణించవయ్యా! నీ ముగ్ధ మనోహర రూపాన్ని చూసిన నా జన్మ చరితార్థం అయ్యింది. ఎప్పుడు తిన్నారో ఏమో బాగా అలసిపోయినట్లు ఉన్నారు. ఇలా కూర్చోండి నాయనలారా!" అంటూ చాప వేసి కూర్చోబెట్టి, తాను లోపలికి వెళ్లి ఒక పండ్ల బుట్టని తెచ్చి వాటిలో కొన్ని పండ్లను పళ్లెములో పెట్టి రామలక్ష్మణుల ముందు ఉంచింది.
ఆ పళ్లెములో నీ పండ్లను ముందుగా ఒక్కొక్క పండును తాను కొరికి రుచి చూచి తియ్యగా రుచిగా ఉన్న పండ్లను మాత్రమే శ్రీరామునికి ఇచ్చింది. శ్రీరాముడు శబరి భక్తికి, అనురక్తికి సంతోషిస్తూ ఆ ఎంగిలి పండ్లను అమృతగా భావించి, తృప్తిగా భుజించి, ఆమెకు మోక్షం కలుగజేశాడు.