ప్రాణాయామంతో మానసిక ఆరోగ్యం మీసొంతం!

     Written by : smtv Desk | Mon, Oct 18, 2021, 04:16 PM

ప్రాణాయామంతో మానసిక ఆరోగ్యం మీసొంతం!

ప్రాణాయామం ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న ఆసనం. ఈజీగా అనిపించే ఆ శ్వాసప్రక్రియను చేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి.. మన శరీరంలో ఏమేం జరుగుతుంది. యోగ లో ఎన్నో ఆసనాలు ఉంటాయని అందరికి తెలుసు. కానీ వాటిల్లో ప్రాణాయామం చాలా ముఖ్యమైనది. ప్రాణాయామం అనేది మన శరీరంలోని ప్రతి కణానికి శక్తినిచ్చే ఒక ఆసనం. ప్రాణాయామం ఒక సంస్కృత పదం, సంస్కృతంలో ఈ పదానికి ‘జీవన శక్తి యొక్క పాండిత్యం’, జీవిత శక్తిని, మన శరీరాన్ని నిలబెట్టే శ్వాసను బయటకు తీయడం అని అర్థం వస్తుంది. ప్రాణాయామం చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది, కానీ క్రమ శిక్షణతో చేయాలి. యోగ శాస్త్రం ప్రకారం జీవిత శక్తికి దారి చూపే అన్నిటిలో పాల్గొనడమే ప్రాణాయామం యొక్క లక్ష్యం. సరిగా శ్వాస తీసుకోవడమే ప్రాణాయామం. ఇందులో మీరు శ్వాస సరిగ్గా తీసుకుంటారు కాబట్టి, ఈ ప్రాణాయామం లో శరీరా భాగాలన్నీ ఉన్నట్టే. దీని వల్ల తాజా ఆక్సిజన్ మీ శరీరంలోని ప్రతి అవయవానికి చేరుకుంటుంది.
రోజూ క్రమం తప్పకుండా చేయడం వల్ల మన శరీరంలోని 80 వేల నరాలు శుద్ధి అవుతాయి. ఇలా శుద్ధి అవ్వడం వల్ల శరీరంలోని ఎనర్జీ ఫ్లో బాలన్స్ అవుతుంది. దీనితో శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. ఇది రోజు చేయడం వల్ల స్ట్రెస్ ను పోగొట్టి ప్రశాంతతను అలాగే ఆరోగ్యాన్ని ఇస్తుందని డాక్టర్స్ చెబుతున్నారు.చాలామంది మెడిటేషన్ చేస్తూ యోగ చేయకుండా తోసిపుచ్చుతారు. అయితే ప్రాణాయామం మీకు శారీరక దృఢత్వాన్ని సాధించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది చేయడం వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుంది కాబట్టి ఇది మీ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా మీ శరీర కాంతి పెంచుతుంది. సహజంగా మీ శరీరానికి గ్లో రావాలంటే రోజు ప్రాణాయామం చెయ్యాలి. ఇది ఒక వ్యక్తి లోని శక్తిని పెంచుతుంది.
ప్రస్తుత రోజుల్లో అందరు బిజీ లైఫ్ గడుపుతున్నారు. దీని వల్ల అందరిలో ఒత్తిడి పెరిగి ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది.
ప్రాణాయామం చేయడం వల్ల ఒత్తిడి తగ్గి ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరగడమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా పెరుగుతుంది. మన మనస్సే మనం రోజు మొత్తం ఏం చేయాలి, ఎలా ఉండాలి అని నిర్దేశిస్తుంది. కాబట్టి మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే మనం మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. ప్రాణాయామం చేయడం వల్ల శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి మన మెదడు లోని నరాల్లో ప్రశాంతత కలుగుతుంది. మన శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుంది ప్రాణాయామం.
అధిక రక్తపోటుతో బాధపడేవారు ప్రాణాయామం చేయడం చాలా మంచిది. సడన్ గా వచ్చే రక్త పోటును కంట్రోల్ చేయడానికి ప్రాణాయామం ఉపయోగపడుతుంది. ప్రాణాయామం ఒక ధ్యానం లాంటిది కాబట్టి ఇది శరీరాన్ని ప్రశాంతంగా ఉంచడమే కాకుండా శరీరానికి అవసరమయ్యే హార్మోన్లను విడుదల చేస్తుంది. ప్రాణాయామం రోజు క్రమం తప్పకుండా చేయడం వల్ల రక్తపోటుతో పాటు, డయాబెటిస్, డిప్రెషన్ వంటి తీవ్రమైన సమస్యలు కూడా తగ్గుతాయి.
ఇప్పటివరకు చేసిన చాలా అధ్యయనాలు ప్రాణాయామం ఒక వ్యక్తి ఆయుష్షును పెంచుతుందని రుజువు చేశాయి. ప్రాణాయామం ఒక వ్యక్తికి సరైన పద్ధతిలో ఊపిరి పీల్చుకోవడానికి ఉపయోగపడుతుంది. మనం ఊపిరి ఎలా పీల్చుకుంటాం అనేది చాలా మందికి తెలియదు. కానీ మన ఆయుష్షు మన శ్వాస రేటుపై ఆధారపడి ఉంటుందని యోగ శాస్త్రం చెబుతుంది.
చాలా మంది బరువు తగ్గడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. కానీ బరువు తగ్గడానికి ప్రాణాయామం చాలా బాగా పని చేస్తుంది. మనం రోజు ప్రాణాయామం చేయడం వల్ల మన శరీరంలోని కొవ్వు కరుగుతుంది. దీనితో మనకి ఎక్కువ ఆహారం తినాలనిపించదు. దానితో మనం సులువుగా బరువు తగ్గుతాం. మనం అలసిపోయినప్పుడు అనారోగ్యకరమైన ఆహారాన్ని తినడానికి ఇష్ట పడతాం. కానీ ప్రాణాయామం చేయడం వల్ల మనకు ఆహారం పట్ల అవగాహన పెరుగుతుంది.
ఈ ప్రాణాయామం జాగ్రతగా చేస్తే చేయడం సులభమే. మీ యోగా మాట్ / మడతపెట్టిన షీట్ మీద మధ్యలో నిటారుగా కూర్చోండి. ఇప్పుడు మీ బొటనవేలితో మీ కుడి వైపు ముక్కుని మూసివేయండి. అలాగే మీ ఎడమ వైపు ముక్కు రంధ్రం నుండి గాలి పీల్చుకోండి. ఇలా చేస్తున్నపుడు మీ వెన్నుపూస నిటారుగా ఉండాలి. మీ శరీరం మొత్తం రిలాక్స్ గా ఉంచాలి. మీ ఎడమ చేతిని మీ ఎడమ మోకాలిపై ఉంచాలి. తరువాత, మీ కుడి చేతి యొక్క ఉంగరపు వేలితో మీ ఎడమ వైపు ముక్కు రంధ్రం మూసివేసి, ఆపై కుడి వైపు ముక్కు రంధ్రం నుండి శ్వాసను విడుదల చేయండి. అలాగే 15 నిమిషాలు చేస్తూ ఉండండి. అవసరమైతే ప్రతి 5 నిమిషాలకు విరామం తీసుకోండి.





Untitled Document
Advertisements