ఇతడు పాండురాజు భార్య మాద్రి సోదరుడు. భీష్ముని కోరికపై తన సోదరి మాద్రిని పాండురాజుకి ఇచ్చి వివాహం చేశాడు. కౌరవుల పక్షాన పోరాడిన నాయకులలో ఒకడు. రుక్మాంగద, రుక్మరధులైన తన కుమారులతో పాటు ఇతడు ద్రౌపది స్వయంవరంకి వచ్చాడు. ఓటమి పాలవుతానని తెలుసుకుని మత్స్యయంత్రాన్ని కొట్టదలచలేదు. ద్రౌపది వివాహసమయంలో భీముడు శల్యుడ్ని ఓడించాడు. పశ్చిమప్రాంత విజయయాత్రలో నకులుడు తన మేనమామ శల్యుడ్ని కలిశాడు. ఇతడు ధర్మరాజు చేసిన రాజసూయయాగంలో పాల్గొన్నాడు. ఆ సమయంలో శిశుపాలుడు శ్రీకృష్ణుడి కంటే శల్యుడే అగ్రతాంబూలం ఇవ్వదగ్గవాడని పేర్కొన్నాడు. యుధిష్టురుడు రాజు అయినప్పుడు ఒక మంచి ఖడ్గం, బంగారు కూజ బహుమతిగా ఇచ్చాడు. మహాభారత యుద్ధ ప్రారంభానికి ముందే కర్ణుడికి సారధ్యం చేసి అతన్ని నిర్వీర్యుడ్ని అయ్యేటట్లు చేస్తానని పాండవులకు అభయమిస్తాడు. వారి కోరికపై తన అక్షౌహిణీ సైన్యంతో శల్యుడు కౌరవులతో కలిశాడు. శల్యుడు విరాట యువరాజు ఉత్తరుడ్ని, విరాటరాజు తమ్ముని వధించాడు. భీష్ముడు చనిపోయినప్పుడు యుద్ధరంగం నుండి పారిపోయాడు. పాండవ యోధులు ఎందరితోనో యుద్ధం చేశాడు. కర్ణుడు నకులసహదేవులను, ధర్మరాజును వధించగల సమయంలో వారిని కాపాడాడు. ద్రోణుని మరణాంతరం దుర్యోధనుడు కర్ణునికి సారథ్యం వహించమనగా ఇష్టం లేకుండా అంగీకరించి అతడిని మాటలతో తూలనాడిన నిర్వీర్యుణ్ణి చేశాడు. శల్యుడు కర్ణుని మరణానంతరం నాయకత్వం స్వీకరించి భీముడితో ధర్మరాజుతో తీవ్ర పోరాటం చేశాడు. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో ధర్మరాజు ఇతన్ని వధించాడు. ఇతడు ప్రహ్లాదుని సోదరుడైన సంహ్లాదుని పునర్జన్మ. అనగా హిరణ్యకశిపుని కుమారుడి పునర్జన్మ.