ఏపీ సచివాలయ మహిళా ఉద్యోగులకు జగన్ సర్కారు గుడ్ న్యూస్

     Written by : smtv Desk | Mon, Nov 15, 2021, 02:12 PM

ఏపీ సచివాలయ మహిళా ఉద్యోగులకు జగన్ సర్కారు గుడ్ న్యూస్

గ్రామ, వార్డు మహిళా పోలీసులకు జగన్ సర్కారు అదిరే శుభవార్త చెప్పింది. మహిళా పోలీసుల ఉద్యోగాలను త్వరలో క్రమబద్ధీకరించనున్న నేపథ్యంలో ప్రభుత్వం మరింతగా ప్రోత్సహించనుంది. క్షేత్రస్థాయిలో మహిళల రక్షణ కోసం కీలకంగా వ్యవహరించే మహిళా పోలీసులకు పదోన్నతులు కల్పించాలని జగన్ సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందుకోసం ముసాయిదా బిల్లును రూపొందించింది. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేశారు. మహిళలు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చేందుకు వెనుకంజ వేస్తున్నందున వారి సమస్యలను స్థానికంగానే గుర్తించి పరిష్కరించేందుకు గ్రామ/వార్డు సచివాలయాల్లో దాదాపు 15 వేల మంది మహిళా పోలీసులను నియమించారు. వారికి కానిస్టేబుల్‌ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసింది. ఈ క్రమంలోనే మహిళా పోలీసుల సర్వీసులను ప్రభుత్వం త్వరలోనే క్రమబద్ధీకరించనుంది. ఇందుకోసం ఇప్పటికే రాతపరీక్ష, ప్రాజెక్టు వర్క్‌లు కూడా ఇప్పటికే పూర్తి చేసింది. ప్రస్తుతం మహిళా పోలీసులు తమ పరిధిలోని పోలీస్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ పర్యవేక్షణలో విధులు నిర్వహిస్తున్నారు. మహిళా పోలీసులకు కానిస్టేబుల్‌ హోదా ఇవ్వడంతో ఇప్పటికే వారు హోం శాఖ పరిధిలోకి వస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ, వారి హాజరు, సెలవుల మంజూరు, జీతాల చెల్లింపు అంశాలు సంబంధిత మున్సిపాలిటీలు/ పంచాయతీల పరిధిలోనే ఉన్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో కొన్ని సమస్యలు వస్తున్నాయని జగన్ ప్రభుత్వం గుర్తించింది. మరోవైపు సాధారణ పోలీసుల ఎంపిక ప్రక్రియ నిబంధనలు ప్రత్యేకంగా ఉన్నాయి. కానీ, సామాన్యులతో మమేకం అయ్యేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల మహిళా పోలీసుల ఎంపిక ప్రక్రియ వేరేగా ఉంది. దీంతో సాంకేతికంగా ఇబ్బందులు రాకుండా మహిళా పోలీసుల సర్వీసులను క్రమబద్ధీకరించాల్సి ఉంది. అందుకోసం సాధారణ పోలీసులుగా కాకుండా మహిళా పోలీసులను ప్రత్యేక వ్యవస్థగా ఏర్పాటు చేయనుంది. సాధారణ పోలీసులకు సమాంతరంగా మహిళా పోలీసు వ్యవస్థ ఉండనుంది. మహిళా పోలీసులకు పదోన్నతులపై కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. ప్రస్తుతం వార్డు/ గ్రామ సచివాలయాల పరిధిలో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులకు పదోన్నతుల కోసం ‘హెడ్‌ కానిస్టేబుల్, ఏఎస్‌ఐ, ఎస్‌ఐ, సీఐ’ పోస్టులను ఏర్పాటు చేయనున్నారు. పట్టణ ప్రాంతాల్లో అయితే కొన్ని వార్డులకు, గ్రామీణ ప్రాంతాల్లో మండలానికి ఒక మహిళా హెడ్‌ కానిస్టేబుల్‌ ఉంటారు.పోలీస్‌ సర్కిల్‌ స్థాయిలో మహిళా ఏఎస్‌ఐ ఉంటారు. పోలీస్‌ సబ్‌–డివిజన్‌ స్థాయిలో మహిళా ఎస్‌ఐ ఉంటారు. పోలీస్‌ జిల్లా స్థాయిలో మహిళా సీఐ ఉంటారు. ఈ పదోన్నతుల అంశంపై మరింతగా సమీక్షించి హోం శాఖ తుది ముసాయిదాను ఖరారు చేయనుంది. అనంతరం బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తోంది.









Untitled Document
Advertisements