టోకెనైజేషన్ విధానాన్ని ప్రవేశపెట్టిన గూగుల్ పే...కార్డు పోతే టోకెన్‌ అప్‌డేట్

     Written by : smtv Desk | Tue, Dec 21, 2021, 04:44 PM

టోకెనైజేషన్ విధానాన్ని ప్రవేశపెట్టిన గూగుల్ పే...కార్డు పోతే టోకెన్‌ అప్‌డేట్

గూగుల్ పే యూజర్ల కోసం మాస్టర్ కార్డు, గూగుల్‌లు టోకెనైజేసన్ విధానాన్ని ప్రవేశపెట్టాయి. మాస్టర్ కార్డు వాడే డెబిట్, క్రెడిట్ కార్డు యూజర్లు ఇబ్బందులు పడకుండా.. సురక్షితమైన లావాదేవీలు చేసుకునేందుకు ఈ టోకెనైజేష్ విధానం ఉపయోగపడనుంది. టోకెనైజేషన్ ద్వారా, మాస్టర్ కార్డు హోల్డర్స్ తమ డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు వివరాలను అంటే కార్డు నెంబర్, ఎక్స్‌పైరీ డేట్ వంటి వాటిని షేర్ చేయకుండానే.. డిజిటల్ టోకెన్‌తో సురక్షితంగా ‘గూగుల్ పే’పై లావాదేవీలు చేసుకోవచ్చు. గూగుల్ పే ఆండ్రాయిడ్ యూజర్లు అన్ని భారత్ క్యూఆర్-ఎనాబుల్డ్ మర్చెంట్ల వద్ద స్కాన్ చేసి, చెల్లింపులు చేసుకోగలగుతారు. అంతేకాక తమ మాస్టర్ కార్డు డెబిట్, క్రెడిట్ కార్డు లావాదేవీలను తేలికగా నిర్వహించుకోగలుగుతారు. టోకెనైజేషన్ విధానంపై నమోదు చేసుకునేందుకు, యూజర్లు ఒక్కసారి మాత్రమే కార్డు వివరాలను, ఓటీపీని నమోదు చేసి తమ కార్డును గూగుల్ పే యాప్‌పై యాడ్ చేసుకోవాలి. మీ మొబైల్ డివైజ్‌లలో చెల్లింపుల సమాచారాన్ని సురక్షితంగా ఉంచేందుకు మాస్టర్ కార్డు డిజిటల్ ఎనాబుల్మెంట్ సర్వీస్(ఎండీఈఎస్) సహకరిస్తుంది. ‘‘గూగుల్ పే వాడుతూ మాస్టర్ కార్డు డెబిట్ లేదా క్రెడిట్ కార్డుతో ఏదైనా కొనుగోలు చేయాలని భావిస్తే, మామూల కార్డు లావాదేవీల మాదిరిగానే, ఈ టోకెనైజేషన్ విధానం ద్వారా కూడా సురక్షితమైన పేమెంట్లను కార్డు హోల్డర్స్‌కు, మర్చెంట్లకు ఆఫర్ చేస్తుంది. చాలా సురక్షితమైన, సౌకర్యవంతమైన సేవలను పొందేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది. కార్డు హోల్డర్స్ మొబైల్ డివైజ్ ఒకవేళ మారినా లేదా పోయినా.. కార్డు వివరాలు సురక్షితంగానే ఉంటాయి. ఈ వివరాలను మేము డిజిటల్ టోకెన్ల మాదిరిగా స్టోర్ చేస్తాం’’ అని మాస్టర్ కార్డు కంపెనీ చెప్పింది. ఒకవేళ కార్డు పోయినా లేదా గడువు తీరిపోయినా లేదా కార్డుని మార్చినా.. యూజర్లు తమ టోకెన్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. ‘‘మాస్టర్ కార్డుపై క్రెడిట్ కార్డులను జారీ చేసే పలు సంస్థలు ఇప్పటికే కార్డు టోకెనైజేషన్‌ను వాడుతున్నాయి. భారత్‌లో టోకెనైజేషన్‌ను విస్తరించేందుకు ఇతర బ్యాంకింగ్ పార్టనర్లతో కలిసి పనిచేస్తున్నాం. సులభతరమైన, సౌకర్యవంతమైన ఈ పేమెంట్ విధానం.. డిజిటల్ పేమెంట్లు సురక్షితంగా చేసుకునే అనుభవాన్ని పెద్ద మొత్తంలో యూజర్లకు అందిస్తుంది. ’’ అని గూగుల్ పే, ఎన్‌బీయూ బిజినెస్ హెడ్ సజిత్ శివానందన్ తెలిపారు.

చెల్లింపులకు అదనపు సెక్యూరిటీని టోకెనైజేషన్ ఆఫర్ చేస్తుందని, షాపింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుందని మాస్టర్ కార్డు సౌతాసియా, కంట్రీ కార్పొరేట్ ఆఫీసర్, డివిజన్ హెడ్ నిఖిల్ సాహ్ని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఉండే ప్రజలు నగదు రహిత సమాజంలోకి మారేందుకు కూడా ఈ పేమెంట్ విధానం సహకరించనుందని పేర్కొన్నారు. ప్రస్తుత చెల్లింపుల వ్యవస్థలో మార్పులు తీసుకురానుందని అన్నారు.






Untitled Document
Advertisements