ఫేక్ సర్టిఫికెట్లతో విదేశాలకు...డబ్బులిస్తే ఏ సర్టిఫికెట్ అయినా క్షణాల్లో

     Written by : smtv Desk | Tue, Dec 21, 2021, 04:55 PM

ఫేక్ సర్టిఫికెట్లతో విదేశాలకు...డబ్బులిస్తే ఏ సర్టిఫికెట్ అయినా క్షణాల్లో

నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ఓ ముఠా గుట్టు రట్టు చేశారు వరంగల్ పోలీసులు.. దేశంలో గుర్తింపు కలిగిన వివిధ యూనివర్సిటీలకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి వాటి ద్వారా విద్యార్థులను విదేశాలకు పంపిస్తున్న ముఠాలోని 12 మందిని అరెస్టు చేశారు.. వరంగల్ ఉమ్మడి జిల్లా కేంద్రంగా ఈ ముఠా ఫేక్ సర్టిఫికెట్ల దందాకు తెర తీసింది..

వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ విశ్వవిద్యాలయాలకు సంబంధించి నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి వాటి ద్వారా విద్యార్థులను విదేశాలకు పంపిస్తున్న 12 మంది సభ్యుల ముఠాను వరంగల్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అయితే ఈ ముఠాలోని మరో ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఇక ఈ ముఠా సభ్యుల నుంచి దేశంలోని వివిధ వర్సిటీలకు సంబంధించిన 212 నకిలీ సర్టిఫికెట్లు, 6 ల్యాప్‌ట్యాప్‌లు, 1 ఐపాడ్, 2 ప్రింటర్లు, 5 సీపీయూలు, 25 నకిలీ రబ్బర్ స్టాంపులు, 2 ప్రింటర్ రోలర్స్, 5 ప్రింటర్ కలర్స్ బాటిల్స్, 1 ల్యామినేషన్ మెషీన్, 12 సెల్ ఫోన్లు, 10 ల్యామినేషన్ గ్లాస్ పేపర్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసు వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వెల్లడించారు.. ఈ ముఠాలో దారా అరుణ్, ఆకుల రవి అవినాశ్ ఇద్దరు ప్రధాన నిందితులు.. వీరిద్దరూ కంప్యూటర్ పరిజ్ఞానం తెలిసి ఉండటంతో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నెట్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అయితే దీని ద్వారా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకోవాలని భావించిన వీరు చిన్న చిన్న నకిలీ సర్టిఫికెట్లను తయారు చేయడం మొదలుపెట్టారు. ఈ విధంగా ఆదాయం ఎక్కువగా వస్తుండటంతో ఈ దందా బాగుందని భావించి మరికొందరితో ముఠా ఏర్పాటు చేశారు.

ఈ నేపథ్యంలోనే విద్యార్థులకు కావల్సిన దేశంలోని వివిధ విశ్వ విద్యాలయాలు, డీమ్డ్ ఇంజనీరింగ్ కళాశాలలకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి ఇవ్వటం మొదలు పెట్టారు. హనుమకొండ పరిధిలోని కొన్ని కన్సల్టెన్సీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. విదేశాల్లో చదువుకోవాలనుకునే వ్యక్తులు, విద్యార్థులకు ఎలాంటి విద్యార్హతలు లేకున్నా ఆయా కన్సల్టెన్సీ యాజమాన్యం తమ కావల్సిన విద్యా సంస్థలకు సంబంధించిన సర్టిఫికెట్లను తయారు చేయాల్సిందిగా ఈ గ్యాంగ్‌కు సమాచారం ఇచ్చేవారు. వీరు తయారు చేసి నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి తిరిగి కన్సల్టెన్సీలకు అందించేవారు. ఈ నకిలీ సర్టిఫికెట్ల ద్వారా కన్సల్టెన్సీ సంస్థలు విద్యార్థులను ఎలాంటి విద్యార్హత లేకున్నా విదేశాలకు పంపేవారు.

ఇందుకు ఈ ముఠా ఒక లక్ష రూపాయల నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు డబ్బును వసూలు చేసేవారని సీపీ తరుణ్ జోషి వెల్లడించారు. ఈ ముఠా సభ్యులు తాము తయారు చేసిన సర్టిఫికెట్లపై ఎవరికీ అనుమానం రాకుండా నిందితులు విదేశాల నుంచి సర్టిఫికెట్ల ముద్రణకు అవసరమైన కాగితాలను ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసేవారు. ఈ వ్యవహారానికి సంబంధించి టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందడంతో ఈ ముఠా కార్యకలపాలపై ప్రత్యేక నిఘా పెట్టి ఏకకాలంలో సంస్థలపై దాడులు నిర్వహించారు. మొత్తం ముఠాలోని 12 మంది సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ముగ్గురి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.





Untitled Document
Advertisements