మాజీ సర్పంచ్ కిడ్నాప్ చేసిన మావోయిస్టులు

     Written by : smtv Desk | Tue, Dec 21, 2021, 06:03 PM

మాజీ సర్పంచ్ కిడ్నాప్ చేసిన మావోయిస్టులు

ములుగు జిల్లాలో మావోయిస్టుల అలజడి రేగింది. మాజీ సర్పంచ్‌ని మావోయిస్టులు కిడ్నాప్ చేయడం కలకలం రేపుతోంది. వెంకటాపురం మండలం సురవీడు పంచాయతీ కొండాపురానికి చెందిన కురుస రమేష్‌ని మావోయిస్టులు కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. సోమవారం సాయంత్రం చర్లకి వెళ్తుండగా ఆయన్ను కిడ్నాప్ చేసినట్లు చెబుతున్నారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు.

2014లో కాంగ్రెస్ పార్టీ తరఫున రమేష్ సర్పంచ్‌గా పనిచేశారు. ఆయన వృత్తిరీత్యా డ్రైవర్. ఆయన భార్య రజిత ఏటూరునాగారం ఆస్పత్రిలో ఏఎన్‌ఎంగా పనిచేస్తోంది. దీంతో కుటుంబంతో కలసి ఏటూరు నాగారంలో నివాసముంటున్నట్లు తెలుస్తోంది. డ్రైవర్‌గా పనిచేసే రమేష్‌కి మావోయిస్టులతో పరిచయం ఉన్నట్లు చెబుతున్నారు. కిడ్నాప్ చేశారని తెలిసినప్పటి నుంచి భార్య రజిత, కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు.

తనకు ఇద్దరు చిన్న పిల్లలున్నారని.. ఆయనకి ఏమైనా జరిగితే తమ పరిస్థితేంటని భార్య రజిత వాపోతోంది. ఏదైనా చెప్పిన పని చేయకపోయినా మావోయిస్టులు ఆయనను క్షమించి వదిలేయాలని వేడుకుంటోంది. అయితే రమేష్‌ని కిడ్నాప్ చేసినట్లు అధికారికంగా ఎలాంటి ధ్రువీకరణ రాలేదు. ఎందుకు కిడ్నాప్ చేసి ఉంటారనే విషయంపై కూడా స్పష్టత రావాల్సి ఉంది.





Untitled Document
Advertisements