కంటైన్‌మెంట్ జోన్లకు సిద్ధంగా ఉండండి...రాష్ట్రాలకు కేంద్రం సూచనలు

     Written by : smtv Desk | Wed, Dec 22, 2021, 05:17 PM

కంటైన్‌మెంట్ జోన్లకు సిద్ధంగా ఉండండి...రాష్ట్రాలకు కేంద్రం సూచనలు

ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా వైరస్ మరో కొత్త వేరియంట్ రూపంలో ముంచుకొచ్చింది. గత నవంబర్‌లో సౌతాఫ్రికాలో బయటపడిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా దేశాలను చుట్టేస్తోంది. డిసెంబర్ 2న భారత్‌లో తొలి ఒమిక్రాన్ పాజిటివ్ కేసు నమోదైంది. కేవలం 20 రోజుల్లోనే ఆ సంఖ్య 200 దాటేసింది. ప్రస్తుతం భారత్‌లో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 200 క్రాస్ చేసింది. ఒమిక్రాన్ వైరస్ డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాపిస్తోందని అధ్యయనాలు చెబుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. రాష్ట్రాలకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా కంటే మూడు రెట్లు వేగంగా వ్యాప్తిస్తుందని తెలిపింది. కరోనా టెస్టులు పెంచడం.. ట్రేసింగ్, ఐసోలేషన్, కంటైన్‌మెంట్ జోన్లు, ఆంక్షలకు సంబంధించి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచనలు చేసింది. వెంటనే జిల్లా యూనిట్‌గా వార్ రూమ్‌లు సిద్ధం చేయాలని.. రోజువారీ పర్యవేక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. విదేశాల నుంచి వచ్చే వారిని ట్రేస్ చేసేందుకు జిల్లా స్థాయి ప్రత్యేక అధికారులకు అనుమతులిచ్చింది. స్థానిక పరిస్థితుల ఆధారంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వారం రోజుల్లో పది శాతం పాజిటివిటీ రేటు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నా.. లేక ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్‌లు 40 శాతం ఆక్యుపెన్సీ ఉంటే వెంటనే ఆంక్షలు అమలుచేయాలని నిర్దేశించింది.ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే దేశంలో పలు చోట్ల ఉందని.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వార్‌ రూమ్‌లు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని పేర్కొంది. ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న తీరును నిశితంగా గమనిస్తూ సరైన సమయంలో డైనమిక్ నిర్ణయాలు తీసుకోవాలని.. అవసరమైతే కఠిన చర్యలు చేపట్టాలని సూచించింది. జిల్లా స్థాయిలో మానిటరింగ్ వ్యవస్థ ఉండాలని.. నియంత్రణ చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని సూచించింది. అలాగే ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య వివరాలు తెలుసుకోవాలని.. కోవిడ్ పాజిటివ్ కేసులు ఉన్నట్లు తెలిస్తే వెంటనే వారి కాంటాక్ట్‌లో ఉన్న వారిని ట్రేసింగ్ చేయాలని పేర్కొంది.

కేసుల సంఖ్య పెరిగితే కంటైన్‌మెంట్ జోన్లు, రాత్రి కర్ఫ్యూలు వంటి కఠిన ఆంక్షలు అమలు చేయాలని సూచించింది. కరోనా పాజిటివ్‌గా తేలిన వెంటనే శాంపిల్స్‌ని జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపాలని.. వంద శాతం వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాలని కేంద్రం సూచించింది. ఆసుపత్రిలో ఆక్సిజన్ బెడ్లు.. అసరమైన మందులు బఫర్ స్టాక్ పెట్టుకోవాలని నియంత్రణ చర్యలపై అప్రమత్తం చేస్తూ నోట్ విడుదల చేసింది.






Untitled Document
Advertisements