ఒమిక్రాన్ వ్యాప్తి...ఢిల్లీలో నో మాస్క్.. నో ఎంట్రీ

     Written by : smtv Desk | Wed, Dec 22, 2021, 07:00 PM

ఒమిక్రాన్ వ్యాప్తి...ఢిల్లీలో నో మాస్క్.. నో ఎంట్రీ

ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు మన దేశంలో కూడా ఆంక్షలు మొదలయ్యాయి. ఇప్పటికే న్యూఇయర్ వేడుకలను నిషేధిస్తూ కర్ణాటక ప్రభుత్వం ప్రకటించగా.. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం కూడా అదే బాటపట్టింది. ప్రజలు భౌతిక దూరం పాటించేలా... మాస్క్ ధరించేలా నిబంధనలను కఠినతరం చేసింది. ఒమిక్రాన్ విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధమైంది.

ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తితో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఒమిక్రాన్ కేసులు అధికంగా ఉన్న అక్కడ కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. క్రిస్టమస్, న్యూ ఇయర్ వేడుకలను నిషేధించింది. కల్చరల్ ప్రోగ్రామ్స్, భారీగా జన సమూహాల చేరికకకు అనుమతి లేదని ఢిల్లీ విపత్తు నిర్వహణ విభగం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా మాస్క్ ధరించకపోతే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య అధికంగా ఢిల్లీలోనే ఉన్నాయి. అక్కడ ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 54కు చేరుకుందని, ఇందులో 18 మంది కోలుకుని డిశార్జ్ అయినట్టు ఢిల్లీ ఆరోగ్య‌శాఖ మంత్రి స‌త్యేంద‌ర్ జైన్‌ తెలియజేశారు.

ఇప్పటికే ప్రపంచాన్ని ఒమిక్రాన్ ఒణికిస్తోంది. బ్రిటన్‌, యూఎస్‌లో చాలా తక్కువ సమయంలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. అదే పరిస్థితి ఇండియాకు వస్తే రోజుకు లక్షల్లో కేసులు నమోదవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. ఈ క్రమంలో కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లా మరికొన్ని రాష్ట్రాల్లో కూడా కఠినమైన నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.





Untitled Document
Advertisements