మనం తీసుకునే ఆహారం వల్ల శరీరం వృద్ధి చెందడమే కాకుండా వివిధ జీవ రసాయన చర్యలకు అవసరమైన శక్తి లభిస్తుంది. ఒక సాధారణ వ్యక్తికి ప్రతిరోజూ కనీసం 2500 కేలరీల శక్తి అవసరం అవుతుంది. ఈ శక్తి అవసరాలు చిన్నపిల్లల్లో అధికంగానూ పెద్దలు లో కొంత తక్కువగానే వుంటాయి. పిల్లల్లో అధిక జీవ రసాయన చర్య వేగం ఉండడమే ఇందుకు కారణం.అంటే సాధారణంగా పిల్లలకు అధిక బలవర్ధకమైన ఆహారాన్ని అందించాల్సి ఉంటుంది. ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్,కొవ్వులు,విటమిన్లు, ఖనిజాలు,నీరు తగు పాళ్లలో ఉంటే దాన్ని పౌష్టికాహారం లేదా సమతౌల్య ఆహారం అంటారు. అందుకే మనం తీసుకునే రోజు వారి ఆహారంలో మన శరీరానికి సరిపడా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్,కొవ్వులు,విటమిన్లు, ఖనిజాలు,నీరు తగు పాళ్లలో ఉండే విధంగా జాగ్రత్త పడడం ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చు. అందుకు మనం ఆయాకాలలలో లభించే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, దుంపలు, తృణధాన్యాలు తప్పక తీసుకోవాలి. వీటితోపాటు పాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు, చేపలు, మాంసం వంటివి కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి.