నాడు వర్మ మూవీ అంటే ఆ క్రేజే వేరు.. మరి నేడు సినిమా విడుదల కష్టాలు

     Written by : smtv Desk | Fri, May 06, 2022, 02:54 PM

నాడు వర్మ మూవీ అంటే ఆ క్రేజే వేరు.. మరి నేడు సినిమా విడుదల కష్టాలు

రామ్ గోపాల్ వర్మ ఈ పేరు వినగానే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా సంచలనాలు సృష్టిస్తుంటారు వర్మ. ఇది అది అని కాకుండా ప్రతి దాంట్లోనూ దూరిపోయి రచ్చరచ్చ చేయడం వర్మ స్పెషాలిటీ. శివ సినిమాతో తెలుగు సినిమాల్లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన వర్మకు దారుణంగా అవమానం జరిగింది. ఆయన తెరకెక్కించిన తాజాగా చిత్రం 'మా ఇష్టం' . ఇద్దరు లేడీ లెస్బియన్ ల కథతో ఈ చిత్రాన్ని వర్మ రూపొందించారు. వివాదాస్పద కథాంశం కావడంతో దీని చుట్టూ వివాదాలు మొదలయ్యాయి. ఏకంగా పీవీఆర్ సినిమాస్ గ్రూప్ థీయేటర్స్ వర్మ సినిమాను ప్రదర్శించలేమంటూ బహిష్కరించాయి.
దీంతో వర్మ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది అన్యాయమని ఈ విషయంలో నేను కోర్టుని ఆశ్రయిస్తానని హెచ్చరించారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరని అలాగే తన మూవీకి అడ్డంకులు సృష్టించి విడుదలను ఆపలేరంటూ ఘాటుగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా దీనిపై పలు ప్రశ్నలు సంధించారు అయినా ఫలితం శూన్యం. అంతే కాకుండా వర్మ ఈ మధ్య నాకు నచ్చినట్టే తీస్తానని చూస్తే చూడండి లేదంటే మీ ఖర్మ అని బాహాటంగానే అనడం పైగా వర్మ చిత్రాల్లో కంటెంట్ బూతద్దం పెట్టి చూద్దామన్నా కనిపించకపోవడంతో ప్రేక్షకులు ఆసక్తిని చూపించడం లేదు.
ఇదే కారణాలతో ఆయన తీసిన చిత్రాలను విడుదల చేయడానికి ఏ డిస్ట్రిబ్యూటరూ సహసం చేయడం లేదు. దీంతో వర్మ చిత్రాలకు విడుదల కష్టాలు ఎదురవుతున్నాయి. ఇదిలా వుంటే ఎట్టకేలకు వర్మ రూపొందించిన 'మా ఇష్టం' సినిమా శుక్రవారం రీలీజైంది. గ్రాండ్ రిలీజ్ అంటూ వర్మ ట్విట్టర్ లో ఈ చిత్ర విడుదలకు పబ్లిసిటీ చేసుకున్నాడు. కట్ చేస్తే ఈ చిత్రానికి హైదరాబాద్ లో దొరికిన థియేటర్ ఒక్కటే. అది కూడా రెండు ఆటల ఒప్పందంతో కావడం గమనార్హం.
ఈ రెండు ఆటలకు కూడా ఓ ట్విస్ట్ వుంది. మే 12న సూపర్ స్టార్ మహేష్ నటించిన 'సర్కారు వారి పాట' విడుదల కాబోతోంది. అంత వరకు మాత్రమే వర్మ 'మా ఇష్టం' రెండు షోలు ప్రదర్శన. ఆ తరువాత నుంచి అది కూడా వుండదు.
మెయిన్ సిటీలోనే ఇలా వుంటే ఇతర సిటీలల్లో వర్మ చిత్రం పరిస్థితి మరీ దారుణంగా మారిందంటున్నారు. పేరు లేని దర్శకులులు తీసే చిత్రాలకు రెండు మూడు థియేటర్లు లభిస్తున్న ఈ రోజుల్లో ట్రెండ్ సెట్టర్ చిత్రాలను తీసిన డైరెక్టర్ వర్మ సినిమాకు ఒక్క థియేటర్ మాత్రమే లభించి అందులో రెండు ఆటలకు మాత్రమే పర్మీషన్ లభించడం ఆయనకు దక్కిన దారుణ అవమానం కాక మరేంటీ అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.
దీంతో వర్మ పని అయిపోయిందని చెబుతున్నారు. ఒకప్పుడు వర్మ మూవీ అంటే ఆ క్రేజే వేరు. ఆ హంగామానే వేరుగా వుండేది. తొలి రోజు మూవీ చూడాలని ఫ్యాన్స్, ఆడియన్స్ భారీ సంఖ్యలో థియేటర్లకు తరలి వచ్చేవారు. కానీ పరిస్థితి మారింది. వర్మ మూవీకి క్రేజ్ పూర్తిగా పడిపోయింది. ఒక్క థియేటర్ అందులో రెండు షోలు.. అది కూడా కేవలం ఆరు రోజులకు పడిపోవడంతో వర్మ ఇక దుకాణం సర్దేయాల్సిందే అంటున్నారు.





Untitled Document
Advertisements