బన్నీని మెగా హీరోల జాబితాలో నుంచి తొలగించిన అభిమానులు!

     Written by : smtv Desk | Mon, May 23, 2022, 05:58 PM

బన్నీని మెగా హీరోల జాబితాలో నుంచి తొలగించిన అభిమానులు!

తెలుగు రాష్ట్రాల ప్రజల మనసుల్లో మెగా ఫ్యామిలికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రతేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే గతకొంత కాలంగా మెగా అభిమానుల్లో చీలిక ఏర్పడిందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కేరీయర్ ప్రారంభించిన తొలినాళ్ళ నుంచి నిన్న మొన్నటి వరకు మెగా ఫ్యామిలీ బ్రాండ్ హీరోగా పిలవబడిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఇటీవల కాలంలో తనకంటూ సొంతగా ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకోవడమే దీనికి కారణమనే అభిప్రాయాలు ఉన్నాయి. అదేవిధంగా సోషల్ మీడియాలో సైతం మెగా - అల్లు అభిమానులు రెండు వర్గాలు చీలిపోయి ఫ్యాన్ వార్స్ చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు బన్నీని అధికారికంగా మెగా హీరోల జాబితాలోనుంచి తొలగించారా అనే కొత్త చర్చ నెట్టింట మొదలైంది.
వివరాల్లోకి వెళ్తే.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 'జనసేన' అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేయడమే ప్రధాన ఎజెండాగా ఆదివారం విజయవాడలో మెగాఫ్యాన్స్ ఆత్మీయ సమావేశం జరిగింది. దీనికి సంబంధించిన బ్యానర్ లో చిరంజీవి - పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ - నాగబాబు ఫోటోలు మాత్రమే ఉన్నాయి.
ఆయితే ఇందులో బన్నీ ఫోటో ఎక్కడా కనిపించలేదు. అలాగే ఈ సమావేశానికి స్టైలిష్ స్టార్ అభిమానులకు ఆహ్వానం కూడా లేదు. ఈ నేపథ్యంలో బన్నీని మెగా హీరోల జాబితా నుండి అధికారికంగా తొలగించినట్లైందని.. మెగా హీరో అనే ట్యాగ్ అల్లు అర్జున్ కి వర్తించదని పరోక్షంగా చెప్తున్నారనే డిస్కషన్ స్టార్ట్ అయింది.
ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్వామి నాయుడు ఆధ్వరంలో జరిగిన మీటింగ్ లో అల్లు అర్జున్ ఫోటో లేకపోవడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో 'చెప్పను బ్రదర్' అని బన్నీ కామెంట్ తో మెగా ఫ్యాన్స్ లో వివాదం మొదలయ్యింది. ఈ క్రమంలో మెగా వెర్సెస్ అల్లు అభిమానులుగా విడిపోయి సోషల్ మీడియాలో ఫైట్ చేసుకున్నారు. దీంతో అల్లు అర్జున్ మెగా బ్రాండ్ కి దూరం అవుతున్నారనే టాక్ వచ్చింది.
నిజానికి గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు బన్నీ మద్దతు తెలిపారు. తనవంతుగా జనసేన అధినేతతో కలిసి ప్రచారం చేశారు. అయితే ఈసారి ఎన్నికలల్లో పవన్ కోసం పని చేయాలని ఫిక్స్ అయిన ఫ్యాన్స్ అసోసియేషన్.. బన్నినీ విస్మరించడం చర్చనీయాంశంగా మారింది. బన్నీ ప్రస్తావన లేకుండా మెగా అభిమానులు ఆత్మీయ సమ్మేళనం అంటూ నిర్వహించడాన్ని చూస్తే గ్రౌండ్ లెవెల్ లో కూడా మెగా vs అల్లు అనే విధంగా మారిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి
అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా సినిమా సినిమాకు తన ఇమేజ్ ను భారీగా పెంచుకుంటూ వెళ్తున్నాడు. తెలుగులోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నారు. 'పుష్ప' సినిమాతో సరికొత్త పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. ఈ క్రమంలో మెగా బ్రాండ్ తో కాకుండా 'AA' అంటూ అల్లు బ్రాండ్ తో ముందుకు సాగుతున్నాడు. ఈ నేపథ్యంలోనే 'మెగా' నీడలో అల్లు అర్జున్ ఎదగాలని అనుకుకోవడం లేదనే కామెంట్స్ వచ్చాయి.
ఇప్పుడు పవన్ - చిరంజీవి - రామ్ చరణ్ అభిమాన సంఘాలు అల్లు అర్జున్ పేరు లేకుండా ఆయన అభిమానులను ఆహ్వానించకుండా మీటింగ్ పెట్టడాన్ని బట్టి ఇరు వర్గాల మధ్య గ్యాప్ వచ్చిందనే నిర్ధారణకు వస్తున్నారు. ఈ సమావేశం చిరు - పవన్ - చరణ్ లకు తెలియకుండానే జరిగిందా? అనే గుసగుసలు మొదలయ్యాయి.
ఇకపోతే మెగా సమావేశంలో జనసేన కు సపోర్ట్ గా ఉండాలని తీర్మానించారు. అయితే గత కొంతకాలంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో చిరంజీవి సాన్నిహిత్యం కొనసాగిస్తూ వస్తున్నారు. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కు బహిరంగంగా మద్దతుగా ఉన్నట్లు ప్రకటించలేదు. జగన్ పరిపాలనా విధానాన్ని వ్యతిరేకించలేదు.
ఇటీవల ఇండస్ట్రీ సమస్యల గురించి వైఎస్ జగన్ తో చిరు మాట్లాడుతూ వచ్చిన సంగతి తెలిసిందే. తమ మధ్య సోదర భావం ఉందని.. దగ్గరుండి బిర్యానీ కూడా వడ్డించారని సీనియర్ హీరో తెలిపారు. మరోవైపు తన అన్నయ్య టిక్కెట్టు ధరలు పెంచాలని కోరుతూ ముఖ్యమంత్రి వద్దకు వెళ్లడం తనకు ఇష్టం లేదని పరోక్షంగా పవన్ కళ్యాణ్ రెండు సమావేశాల్లో చెప్పారు.
కానీ ఇప్పుడు ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ మాత్రం జనసేన పార్టీకి మద్దతు తెలుపుతూ.. పవన్ కళ్యాణ్ గెలుపు లక్ష్యంగా పని చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఈ భేటీ గురించి చిరంజీవికి నిజంగా తెలుసా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తొందర్లోనే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.





Untitled Document
Advertisements