బాల్యంలో ఉన్నంత చురుగ్గా యవ్వనంలో ఉండలేము.. యవ్వనంలో ఉన్నంత బలంగా యవ్వనం దాటిన తరువాత ఉండలేము. వయసు పెరిగే కొద్ది ఒంట్లోని శక్తి సన్నగిల్లుతుంది. వయసులో ఉన్నప్పుడు ఎంత పని చేసిన అలసట దరి చేరదు. అదేవిధంగా ఎటువంటి ఆహారపదార్థాలు తిన్న అరిగించుకునే శక్తి ఉంటుంది. అయితే వయసు పై పడే కొద్ది ఏది పడితే అది తినడం మానేయాలి. కారణం వయసులో ఉండగా ఎక్కువగా కష్టపడే బలం మన దేహానికి ఉంటుంది కనుక ఎంత తిన్న ఇట్టే జీర్ణం అవుతుంది. అదే విధంగా వయసు పైబడే కొద్ది రకరకాల ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశము లేకపోలేదు. అయితే 40 ఏళ్ళు దగ్గరపడ్డాయి అంటే ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ వయసులో మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు వంటివి ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి 40 ఏళ్లు దాటిన తర్వాత ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో కొన్ని పద్ధతులు పాటించాలి.
పీచు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. కొలెస్ట్రాల్,చక్కెర పాళ్లు తక్కువగా ఉండేలా చూసుకోవడం శ్రేయస్కరం. ఆహారంలో కూరగాయలు ధాన్యాలు, తాజాపండ్లు,ఆకుకూరలు ప్రాధాన్యం ఇవ్వాలి. నూనె పదార్థాలను చాలా మటుకు తగ్గించాలి. 40 లో ఉండే వారు ప్రతిరోజు వ్యాయామం చేయడం చాలా ముఖ్యం.ఫిటినెస్ ను దీర్ఘకాలం కాపాడుకోవడానికి వ్యాయామం ఎంతో అవసరం. చెడు అలవాట్లకు దూరంగా ఉండటం ద్వారా ఆరోగ్యంగా ఉండగలుగుతారు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.