పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పైపైకి వెళుతున్నాయి. ఇంతకు ముందెన్నడూ లేనంతగా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి అని.. ఆర్టీసీ ఛార్జీలు పెంచడం జరిగింది అయినప్పటికీ నష్టం వస్తుందని ఈసారి మళ్ళి టికెట్ ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు రౌండ్ ఫిగర్ అంటూ ఓసారి, డీజిల్ సెస్ పేరుతో రెండుసార్లు, టోల్ సెస్, ప్యాసింజర్ సేఫ్టీ సెస్ తో దాదాపు 35 శాతం వరకు చార్జీలు పెంచింది. ఇప్పటికే ప్రతిపాదనలు తయారు చేశారు. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి సైతం పంపించారు. సగటున 20 నుంచి 30 శాతం వరకు పెంచుకునేందుకు ప్రపొజల్స్ లో సూచించారు. త్వరలోనే దీనికి ఆమోదం వస్తుందని అధికారులు చెప్తున్నారు. టికెట్ ధరల పెంపుపై ఇప్పటికే రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పలు సందర్భాల్లో ప్రకటించారు. అయితే, డీజిల్ సెస్ రూపంలో రెండుసార్లు పెంచగా.. టికెట్ ధరలు ఉండవని భావించారు. సెస్ ల రూపంలో అదనంగా వసూళ్లు చేస్తున్నా.. ఇంకా రూ. 2.40 కోట్ల వరకు నష్టం వస్తుందని ఆర్టీసీ ఉన్నతాధికారులు వెల్లడించారు. దీన్ని భర్తీ చేసుకునేందుకు ఇప్పుడు టికెట్ ధరల పెంపు అనివార్యంగా మారుతోంది.
టికెట్ ధరల పెంపుపై ప్రతిపాదనలు పూర్తి చేశారని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఈ ప్రతిపాదనల ప్రకారం 100 కిలోమీటర్ల లోపు 30 శాతం టికెట్ ధరలు పెరుగనున్నాయి. పల్లె వెలుగు, ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సులకు ఇది వర్తించనుంది. ఇక దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల టికెట్ ధర 20 శాతం వరకు ఉండనుంది. డీలక్స్, లగ్జరీ, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ వంటి బస్సులకు 20 శాతం పెంపు ఉండనుంది. దీంతో రోజువారీ నష్టం తగ్గుతుందని అధికారులు అంచనా వేశారు. ఇలా పెంచినా సగటున కిలోమీటరుకు టికెట్ పై రూ. 2 నుంచి రూ. 3 వరకు పెరుగుతుందని అధికారులు ఆఫ్ ది రికార్డు చెప్తున్నారు. దీనిపై ఇటీవల మంత్రి, ఆర్టీసీ చైర్మన్, ఎండీ సమక్షంలో సమీక్షించినట్లు తెలుస్తోంది. ఆర్డినరీ, సిటీ బస్సులపై కిలోమీటరుకు 25 పైసలు, ఆపై బస్సులపై 30 పైసలు చొప్పున ప్రతిపాదించినట్లు మంత్రి అజయ్ కూడా గతంలోనే ప్రకటించారు. మినిమం చార్జీపై రూ.5 వరకు పెంచాలనే ప్రతిపాదనలు కూడా సీఎంకు ఇచ్చినట్లు తెలిపారు. వీటిలో కొన్ని మార్పులు చేసి, మరోసారి సీఎంకు నివేదించినట్లు అధికారవర్గాల సమాచారం. దీనిపై ఆమోదం వస్తే.. త్వరలోనే ఆర్టీసీ బస్ టికెట్ ధరలు మరింత పెరుగనున్నాయి.