రోజు రోజుకి అన్ని దరలు పెరుగుతూనే ఉన్నాయి.. ఈ నేపథ్యంలో హీరో మోటార్స్ కూడా ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. ఇండియా నంబర్ వన్ టూవీలర్ బ్రాండ్ హీరో మోటార్స్ తన అభిమానులకు షాక్ ఇచ్చింది. హీరో నుంచి వస్తున్న టూ వీలర్ల ధరలను పెంచుతున్నట్టు నిర్ణయించింది. ఒక్కో బైకు/స్కూటర్/మోటర్ సైకిల్పై సగటున రూ.3000 వంతున ధరలు పెంచక తప్పడం లేదని గురువారం ప్రకటించింది. పెరిగిన ధరలు జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది.
ద్రవ్యోల్బణం ఎఫెక్ట్, ముడి విభాగాల ధరలు పెరిగిపోవడం వల్ల తమ టూవీలర్ల ధరలు పెంచక తప్పలేదంటూ హీరో ప్రకటించింది. హీరో మోటర్స్కి సంబంధించి పదుల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు మార్కెట్లో ఉన్నాయి. ఏ మోడల్పై ఎంత ధర పెంచిందనే విషయాలపై హీరో స్పష్టత ఇవ్వలేదు. మరికొద్ది రోజుల్లో మోడళ్ల వారీగా ధరల పెంపుకు సంబంధించి క్లారిటీ రానుంది. మార్కెట్ లీడర్ హీరో ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం వల్ల .. రాబోయే రోజుల్లో ఇతర కంపెనీలు ఇదే మార్గం అవలంభించే అవకాశం ఉంది.