మహారాష్ట్ర రాజకీయాల్లో సంక్షోభం కొనసాగుతోంది. శివసేన చీలిక వర్గానికి నేతృత్వం వహించిన ఏక్నాథ్ షిండే మరో ట్విస్ట్ ఇచ్చారు. తమతో ఏ జాతీయ పార్టీ సంప్రదింపులు జరపడం లేదని పేర్కొంటూ యూటర్న్ తీసుకున్నారు. శక్తివంతమైన జాతీయ పార్టీ తమకు సాయం చేస్తోందని చెప్పిన మరుసటి రోజే ఆయన మాట మార్చడం గమనార్హం..
మీడియాకు విడుదల చేసిన వీడియోలో తన వర్గం ఎమ్మెల్యేలతో ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ.. 'మనమంతా ఐక్యంగా ఉండాలి. మనం చేసిన తిరుగుబాటును ఓ జాతీయ పార్టీ ప్రశంసించింది. మనకు ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధమని ముందుకు వచ్చింది. ఆ జాతీయ పార్టీ మహాశక్తివంతమైనద'ని పేర్కొన్నారు. దీనిపై ఇప్పుడు ఆయన మాట మార్చారు.
శివసేన చీలిక వర్గానికి బీజేపీ మద్దతు ఇస్తుందా అన్న ప్రశ్నపై.. ఓ టీవీ చానల్తో షిండే శుక్రవారం మాట్లాడుతూ.. 'ఓ మహాశక్తి మాకు ఇస్తుందని నేను చేసిన వ్యాఖ్యలు బాలాసాహెబ్ ఠాక్రే, ఆనంద్ డిఘేలను ఉద్దేశించినవ'ని జవాబిచ్చారు. కాగా, మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభంతో తమకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ స్పష్టం చేసింది. శివసేన పార్టీ అంతర్గత వ్యవహారంలో వేలు పెట్టబోమని తెలిపింది.